IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ సందడి ప్రారంభమైన వేళ సీఎస్కే అభిమానులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా ఈ సీదన్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. కాలి కండరాల నొప్పితో బాధపడుతున్న ఎంఎస్ ధోనీ.. దాదాపు మొదటి రెండు వారాల పాటు స్టేడియంలోకి దిగే అవకాశం లేదని సమాచారం.
ధోనీకి అసలు ఏమైంది?
ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్కు ముందే సీఎస్కే యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధోనీ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారని.. ప్రస్తుతం ఆయన రిహాబిలిటేషన్లో ఉన్నారని స్పష్టం చేసింది. జట్టు యాజమాన్యం ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నప్పటికీ.. మొదటి 15 రోజుల పాటు ధోనీ అందుబాటులో ఉండడని తేలిపోయింది. 44 ఏళ్ల వయస్సులోనూ ఫిట్ నెస్తో అలరిస్తున్న ధోనీకి ఈ గాయం అడ్డంకిగా మారింది.

తొలి మ్యాచ్లోనే సవాల్
మార్చి 30న గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఎంఎస్ ధోనీ లేకపోవడం జట్టు కాంబినేషన్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మ్యాచ్ ఫినిషర్గా వికెట్ల వెనుక నుంచి బౌలర్లకు దిశానిర్దేశం చేసే విషయంలో ఎంఎస్ ధోని లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒత్తిడి సమయాల్లో జట్టును శాంతపరిచే కూల్ కెప్టెన్ సలహాలు మిస్ అవ్వడం సీఎస్కే మైనస్ అని చెప్పుకోవచ్చు.
వికెట్ కీపింగ్ బాధ్యతలు ఎవరికి?
ఎంఎస్ ధోనీ స్థానంలో వికెట్ల వెనుక ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సీఎస్కే వద్ద మూడు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ వికెట్ కీపింగ్కు ప్రధాన రేసులో ఉన్నారు. సంజు శాంసన్కు అంతర్జాతీయ అనుభవం ఉండటం సీఎస్కేకు కలిసొచ్చే అంశం. యువ ఆటగాడు కార్తీక్ శర్మ కూడా బ్యాకప్ కీపర్గా జట్టులో ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న ఉర్విల్ పటేల్ కూడా కీపింగ్ రేసులో ఉన్నారు.278 ఐపీఎల్ మ్యాచ్ల అనుభవం ఉన్న ధోనీ లేని సీఎస్కేను ఊహించుకోవడం అభిమానులకు కష్టంగానే ఉంది. మరి ధోనీ లేని ఈ రెండు వారాల్లో చెన్నై ఎలా రాణిస్తుందో చూడాలి!