హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ అంటే గుర్తొచ్చే వారి పేర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. అలాంటి కెప్టెన్సీని భారత్కు అందించి రెండు ప్రపంచ కప్లు తెచ్చిపెట్టారు. అయితే తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి సరైన సమయంలోనే తప్పుకొన్నానని అంటున్నారు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 2019 ప్రపంచకప్ సమయంలో తన స్థానంలో కొత్త కెప్టెన్ రావాలన్న ఆకాంక్షతోనే తాను తప్పుకొన్నట్లు వెల్లడించారు.
'2019 ప్రపంచకప్ సమయానికి జట్టు అవసరాలకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవడానికి కెప్టెన్కు కొంత సమయం కావాలి. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నాను. కొత్త కెప్టెన్కు సమయం ఇవ్వకుండా జట్టును ఎంపికచేసుకోమనడం సాధ్యం కాదు. అందుకే సరైన సమయంలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నా' అని వెల్లడించారు.
బుధవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముందా విమానాశ్రయంలో నిర్వహించిన సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి ధోనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విలేకర్లతో తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వెల్లడించారు. వన్డే కెప్టెన్సీకు ధోనీ విరామం ప్రకటించి సరిగ్గా ఏడాదిన్నర అవుతోంది. ఆయన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఎందరో అభిమానులను నిరాశపరిచినా తనదైన శైలిలో భారత్ను విజయపథాన నడిపించేందుకు పరుగుల యంత్రం కోహ్లీ ఎప్పుడూ ముందే ఉంటున్నాడు.
ప్రస్తుతం ధోనీ క్రికెట్ నుంచి కాస్త విరామం దక్కడంతో తన సమయాన్ని కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్లో టీమిండియా పూర్తి జట్టులో ధోనీ ఒకడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లతో కలిసి ధోనీ గురువారం దుబాయ్ బయలుదేరినట్లు సమాచారం.