హైదరాబాద్: ఐపీఎల్లో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఈ ఏడాది పునరాగమనం చేసి విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటింగ్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ 200+ లక్ష్యాలను సైతం చెన్నై ఛేదించేసింది. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ని బలోపేతం చేయడంతోనే ఈ విజయాలు సాధ్యమైయ్యాయని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తాజాగా వెల్లడించాడు. సాధారణంగా టీ20ల్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ధోనీ.. ఐపీఎల్ 2018 సీజన్లో మాత్రం టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి జట్టు విజయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు.
'టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న సమయంలోనే ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఐపీఎల్కు ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించేందుకు ఎక్కువ బ్యాటింగ్ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నా. దీనికి అనుగుణంగా మ్యాచ్లో మిగిలి ఉన్న ఓవర్లు బట్టి 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్కి దిగాను.
'ఈ సీజన్లో ఐపీఎల్ జట్టు కోసం చర్చించాల్సిన సందర్భంలో నా బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకోవాలనే ఆలోచనకు వచ్చా. అందుకు నా వయసు ఒక కారణం. ఓవరాల్ ఐపీఎల్లో నా బ్యాటింగ్ ఆర్డర్లో కింది స్థానాల్లో వచ్చిన సమయాల్లో నేను పెద్దగా రాణించలేదు. అందుకు ఈ సీజన్లో సాధ్యమైనంత వరకూ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలని ఫిక్సయ్యా. నాకు మా జట్టు గెలవడమే ముఖ్యం'
లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తే అవకాశం తక్కువ దొరుకుతుంది. అందుకే.. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తానని జట్టు సమావేశంలో వెల్లడించాను. ఒకవేళ తొందరగా ఔటైనా.. మిగిలిన వాళ్లకి మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం దొరుకుతుందని నా ఆలోచన. టోర్నీలో ఓపెనర్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, డ్వేన్ బ్రావో మెరుగ్గా ఆడటంతో తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయాల్సిన అవసరం లేకపోయింది' అని ధోనీ వెల్లడించాడు.