
హైదరాబాద్: ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన మాజీ ఆటగాళ్లనే కొనుగోలు చేస్తామని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2018 సీజన్ కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వాహకులు వేలం నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధోని ప్రసంగించాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ను వేలంలో కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పాడు.
సుమారు రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి ఐపీఎల్లో ఆడబోతోనన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు ఉన్నారని.. ఒకవేళ వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చేజారితే కుర్రాళ్లతోనే ముందుకు వెళ్లేందుకు సిద్ధమని ధోని తెలిపాడు.
జనవరి 4న ముగిసిన ప్లేయర్ రిటెన్షన్ ఈవెంట్లో చెన్నై ప్రాంఛైజీ రూ. 33 కోట్లు వెచ్చించి ధోని (రూ. 15 కోట్లు), సురేశ్ రైనా (రూ. 11 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 7 కోట్లు)లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో చెన్నై ప్రాంఛైజీ వద్ద ప్రస్తుతం రెండు రైట్ టు మ్యాచ్ కార్డులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ రెండు కార్డులను ఐపీఎల్ వేలంలో మాజీ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు గాను వినియోగించుకోనున్నట్లు ధోని తెలిపాడు. అయితే అశ్విన్ను వేలంలో దక్కించుకునేందుకు గాను తాము రైట్ టు మ్యాచ్ కార్డుని వినియోగించబోమని, బలమైన జట్టుని తయారు చేసేందుకు గాను వీటిని వాడతామని ధోని అన్నాడు.
'వేలంలో అశ్విన్ను తప్పక దక్కించుకుంటాం. అతడు లోకల్ ప్లేయర్. చెన్నై సూపర్ కింగ్స్లో ఎక్కువ మంది లోకల్ ప్లేయర్లు ఉండాలని కోరుకుంటున్నా. వీరితో పాటు చెన్నై జట్టు మాజీ ఆటగాళ్లు బ్రెండన్ మెక్కల్లమ్, డుప్లెసిస్, డ్వేన్ బ్రావోలను కూడా వేలంలో కోనుగోలు చేస్తాం. ప్రస్తుతం మా వద్ద రెండు రైట్ టు మ్యాచ్ కార్డులు ఉన్నాయి. వాటిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసు' అని ధోని అన్నాడు.
'అయితే అశ్విన్ కోసం రైట్ టు మ్యాచ్ కార్డు వినియోగించం. ఎందుకంటే ఇప్పటికే జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. వేలంలోనే అతడిని కోనుగోలు చేస్తాం. అంతేకాదు వేలంలో ఒక్కో ఆటగాడికి ఎంత మనీ ఖర్చు పెట్టగలమో, అదే విధంగా బలమైన జట్టుని తయారు చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం' అని ధోని అన్నాడు.
ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ప్రభావం చూపబోవని ధోని ఈ సందర్భంగా తెలిపాడు. 'సీఎస్కే జట్టులో తప్ప మరో ఫ్రాంఛైజీకి ఆడాలనే ఆలోచన నాకు ఎన్నడూ రాలేదు. చెన్నై నాకు మరో ఇల్లు. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. అంతకు మించి నాకు దక్కే గొప్ప ప్రశంస మరొకటి లేదు. చెన్నై నాకెంతో ప్రత్యేకమైన చోటు. మద్దతుగా నిలిచే మేనేజ్మెంట్, ఆటగాళ్లు, అభిమానులు ఇంతకు మించి ఇంకేం కావాలి. ఈ ఐపీఎల్ సీజన్లో సత్తా చాటి తీరతాం.ఏ ఫ్రాంఛైజీ అయినా నన్ను వారి జట్టు తరఫున ఆడామని అడిగితే నేను వారికి సులువుగా నో అని సమాధానం చెప్పగలను' అని ధోని అన్నాడు.
ఇక జట్టు కూర్పు విషయానికి వస్తే ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నామని ధోని తెలిపాడు. 'మొత్తం ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాం. అందులో ఓ కీపర్, ఇద్దరు బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ బౌలింగ్ కూడా చేయగలుగుతారు. అందులో ఒకరు లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా, మరొకరు ఆఫ్ స్పిన్నర్' అని ధోని అన్నాడు.
ఇక, చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టింగ్ స్టాఫ్గా బాలాజీ, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఫ్లెమింగ్ జట్టులో చేరారు. ఐపీఎల్ 2018 సీజన్కు గాను చెన్నై జట్టు హెడ్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ కొనసాగనున్నారు. బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీని ఎంపిక చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.