చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్లేఆఫ్స్ ముగింట్లో నిలిచింది ధోనీ సేన. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకోవడం ఖాయమౌతుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడిన ఈ ఎల్లో ఆర్మీ ఏడింట్లో ఘన విజయాలను సాధించింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇంకా రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉంది చెన్నై సూపర్ కింగ్స్కు. కోల్కత నైట్ రైడర్స్, ఢిల్లీ కేపిటల్స్తో తలపడాల్సి ఉంది. ఈ రెండింటితో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. తన తదుపరి మ్యాచ్ను కేకేఆర్తో ఆడబోతోంది. ఈ ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. చివరి లీగ్ మ్యాచ్ ఈ నెల 20వ తేదీన ఆడనుంది.

ఈ రెండింట్లో ఏ ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ను ధోనీ సేన ఖాయం చేసుకుంటుంది. గత ఏడాది అవమానకరంగా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగింది సీఎస్కే. 14 మ్యాచ్లల్లో నాలుగింట్లో మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. ఆ లోటును భర్తీ చేసేలా ఈ సీజన్లో పోరాడుతోంది. ప్లేఆఫ్స్ చేరుకోగలిగితే ఫైనల్స్ వరకు వెళ్లడానికి చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా శ్రమించనక్కర్లేదనే అంచనాలు ఉన్నాయి.
సీఎస్కేను మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా నిలిపిన ఘనత ఎంఎస్ ధోనీకే దక్కుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ధోనీ సారథ్యంలో ఇప్పటివరకు నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచింది ఈ జట్టు. ముంబై ఇండియన్స్ తరువాత అత్యధికంగా టైటిళ్లను గెలిచిన జట్టు ఇదే. ఈ సీజన్లో కూడా ధోనీ తన జట్టుకు కప్ను అందించి ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు కొంతకాలంగా వినిపిస్తోన్నాయి. ఇదే చివరి సీజన్ అవుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.
దీనికి తెర దించారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు. ఇప్పట్లో ఐపీఎల్ నుంచి వైదొలగాలనే ఆలోచన ధోనీకి లేదని తేల్చి చెప్పారు. 2025 వరకు ఐపీఎల్లో కంటిన్యూ కావాలనే నిర్ణయానికి వచ్చాడని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ వరకూ కొనసాగుతాడని, ఆ సీజన్ తరువాతే రిటైర్ కావొచ్చని తేల్చిచెప్పారు. తన రిటైర్మెంట్ గురించి ధోనీ ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్ వద్ద ఎలాంటి ప్రస్తావన తీసుకుని రాలేదని ఆయన పేర్కొన్నారు.
ఐపీఎల్కు వీడ్కోలు చెప్పే రోజు త్వరలోనే ఉంటుందని తాము భావిస్తోన్నప్పటికీ- అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చని సీఎస్కే అధికారి చెప్పుకొచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ తన జట్టుకు ధోనీ వారసుడిని అన్వేషించట్లేదని కూడా తెలిపారు. గతంలో రవీంద్ర జడేజాకు జట్టుకు సారథ్యాన్ని వహించే అవకాశం లభించినప్పటికీ- దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని గుర్తు చేశారు.