హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం జార్ఖండ్ జట్టు కెప్టెన్గా ధోని విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్లో భాగంగా బెంగాల్ జట్టుతో జార్ఖండ్ తలపడనుంది.
ఈ క్రమంలో ధోని ఈ మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీలోని ద్వారకలోని వెల్కం హోటల్లో జట్టు సభ్యులందరూ బస చేశారు. అయితే శుక్రవారం ఉదయం 6.30 నిమిషాల ప్రాంతంలో హోటల్లో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లో బస చేసిన జార్ఖండ్ జట్టు సభ్యులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 30 ఫైరింజన్లతో గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ధోనితో పాటు హోటల్లో బస చేసిన మిగతా క్రికెటర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ కాకపోవడంతో హోటల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది.
అయితే జార్ఖండ్ జట్టు క్రికెట్ కిట్ మొత్తం మంటల్లో కాలిపోయింది. దీంతో బెంగాల్, జార్ఖండ్ జట్ల మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ను వాయిదా వేశారు. హోటల్కి సమీపంలోని షాపింగ్ మాల్లో తొలుత మంటలు వ్యాపించి ఆ తర్వాత ఆ మంటలు హోటల్కు వ్యాపించాయని అంటున్నారు.