CSK VS RCB: చెన్నై చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 16 బంతుల్లోనే 30 పరుగులు దూకుడుగా ఆడి అజేయంగా నిలిచాడు. అయినప్పటికీ సీఎస్కే ఓడిపోయింది. దీంతో మహీ.. కాస్త ముందుగా బ్యాటింగ్ కు వచ్చి ఉంటే గెలిచే అవకాశాలు ఉన్నాయని, అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్లు, అభిమానులు చర్చిస్తున్నారు. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా ధోనీని విమర్శిస్తూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాను అసలెందుకు లోయర్ ఆర్డర్ చివర్లో బ్యాటింగ్ కు ఎందుకు వస్తున్నాడో తెలిపాడు మహీ. అతడి మాటలు బట్టి.. ఒకటి లేదా రెండు మ్యాచుల్లో ఓడినా యంగ్ ప్లేయర్స్ కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడమే ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు ధోనీ ఇప్పుడు చేసినవి కావు. గతంలో చేసినవి. కాగా, గత ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ నెం.8లో బ్యాటింగ్ దిగిన సంగతి తెలిసిందే.

"నాకు మోకాలిలో సమస్య ఉంది. గతేడాది నేను దాని నుంచి కోలుకున్నాను. పైగా నెక్ట్స్ టీ20 వరల్డ్ కప్ సెలక్షన్ ఉంది. సీఎస్కే జట్టు తరఫున రవీంద్ర జడేజా, శివమ్ దూబె.. ఈ ప్రపంచ కప్ కోసం పోటీలో ఉన్నారు. కాబట్టి వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. నేనెలాగో ఆ సెలక్షన్ రేసు కోసం పోటీ పడట్లేదు కదా. ఇక రవీంద్ర జడేజా, శివమ్ దూబె అద్భుతంగా ఆడుతున్నారు. మా ఫ్రాంచైజీ ప్లేయర్ల అవకాశాలను దెబ్బ తీయదు. వాళ్లను ప్రమోట్ చేసేందుకు చూస్తుంది. అయినా ఎవరి పాత్రను వారు పోషిస్తూ ఉంటే నాపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. అంతకన్నా ఇంకేం కావాలి. అయితే ఒకటి, రెండు మ్యాచుల్లో ఫలితం మాకు అనుకూలంగా రాకపోయినా పర్వాలేదు. ప్రతిసారీ ఇలాగే జరిగితే అప్పుడు నా ఆలోచనల్లో మార్పు తీసుకొస్తాను. అంతా బాగుంటే అలాగే కొనసాగించాలి '' అని ధోనీ చెప్పుకొచ్చాడు.