Dhoni IPL Retirement : అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ ఆరేళ్ల కిందటే దూరమైనా.. ఐపీఎల్ కెరీర్ను మాత్రం ఒక్కో ఏడాది పొడిగించుకుంటూనే వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూణ్నాలుగేళ్ల నుంచి ప్రతీ సీజన్ ముందు మహీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. కానీ అతడు ఫిట్నెస్, ఫామ్ కాపాడుకుంటూ ఒక్కో సీజన్ను ముగిస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా సీఎస్కే వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచుకు ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు రావడంతో.. మరోసారి మహీ ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రచారం ఊపందుకుంది. ధోనీ ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడని అంతా ఫిక్సైపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్సీబీతో మ్యాచుకు ముందు తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు సీఎస్కే స్టార్ ధోనీ.
ఎదురులేనట్టే...
ధోనీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎప్పటిలాగే చివర్లో కాస్త అటు ఇటుగా బ్యాటింగ్ కు వచ్చి బానే మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో 0, 30 నాటౌట్, 16, 30 స్కోర్లు చేశాడు. అలానే రెప్పపాటు వేగంతో కళ్లు చెదిరేలా రెండు స్టంప్ ఔట్లు కూడా చేశాడు. దీంతో మహీ వికెట్ కీపింగ్ నైపుణ్యానికి క్రికెట్ ప్రపంచమంతా ఆశ్యర్యపడింది. బ్యాటింగ్లోనూ ధోనీ ఇంకాస్త దూకుడు చూపిస్తే మరికొన్నేళ్లు అతడికి లీగ్లో ఎదురులేనట్లే అని పలువురు క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరోవైపు ఇదే సమయంలో అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. పలువురు హేటర్స్, మాజీలు.. మహీ ఐపీఎల్ కు వీడ్కోలు పలకాలని సూచిస్తున్నారు.
అందరూ అదే చర్చ..
అయితే ఇదే సమయంలో తాజాగా దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచుకు ధోనీ తల్లిదండ్రులు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొంపతీసి మహీ నిజంగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడా ఏంటి అని అందరూ చర్చించుకోవడం ప్రారంభించారు. ధోనీ రిటైర్మెంట్ హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో తన ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రచారంపై మహీ స్పష్టత ఇచ్చాడు.

అదే నా రిటైర్మెంట్ నిర్ణయిస్తుంది..
"నేను ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాను. ఇప్పుడు నా వయసు 43. వచ్చే సీజన్ జులై నాటికి 44 ఏళ్లు వస్తాయి. కాబట్టి మరో సీజన్ ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి ఇంకో 10 నెలల సమయం ఉంది. అయినా నేను ఆడాలా వద్దా అనేది నేను నిర్ణయం తీసుకోను. ఆడగలమా లేదా అనే శరీరం నిర్ణయం తీసుకుంటది." అని అన్నాడు.