హైదరాబాద్: గత కొన్నేళ్లుగా భారత జట్టు తరుపున పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్లను విజయవంతంగా ముగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నో మ్యాచ్ల్లో తనదైన శైలిలో విన్నింగ్ షాట్లు కొట్టి నాటౌట్గా నిలిచి జట్టుకి విజయాలు అందజేశాడు.
అలాంటి ధోనిపై శ్రీలంక సిరిస్కు ముందు మాజీ క్రికెటర్లతో పాటు క్రీడా విశ్లేషకులు సైతం విమర్శలు కురిపించారు. తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ధోని తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. తాజాగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో వన్డేల్లో ధోని 67 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ నేపథ్యంలో గొప్ప ఫినిషర్గా పేరు తెచ్చుకున్న ధోనీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. లక్ష్య ఛేదనలో నాటౌట్గా నిలిచి జట్టుకి విజయాలు అందించిన ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 299 వన్డేలు ఆడిన ధోని మొత్తం 121సార్లు నాటౌట్గా నిలిచాడు.
ఈ మేరకు ఐసీసీ తన ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు లక్ష్య ఛేదనలో ధోని 40 సార్లు నాటౌట్గా నిలిచి చరిత్ర రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్(33), పాకిస్థాన్కు చెందిన ఇంజమామ్ ఉల్హాక్(32), ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్(31)లు ఉన్నారు.
మరోవైపు భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోని నాలుగో స్ధానంలో నిలిచాడు. భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్లు ఉన్నారు. 2019 వరల్డ్ కప్ వరకు ధోని ఆడితే పదవేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ధోని 51 యావరేజితో 9608 పరుగులు పూర్తి చేశాడు.