
దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. 2019 తర్వాత మళ్లీ ఈ సారి ఐపీఎల్ను హోం, ఎవే ఫార్మాట్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ తన అభిమాన చెపాక్ స్టేడియంలో బరిలో దిగేందుకు ధోనీ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతను చేస్తున్న చిన్న చిన్న తమాషా పనులను చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్లో పంచుకుంటోంది.
ఐపీఎల్ కోసం అందరి కన్నా ముందు ప్రాక్టీస్ మొదలు పెట్టిన ప్లేయర్ ధోనీనే. ఇప్పుడు చెపాక్లో తమ జట్టు మొత్తంతో కలిసి ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టేడియంలోని కొన్ని సీట్లకు ధోనీనే స్వయంగా ఎల్లో పెయింట్ వేశాడు. చిన్న పెయింట్ డబ్బా తీసుకొని, సీట్లకు స్ప్రే పెయింట్ వేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తమ సోషల్ మీడియాలో పంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. 'ఇది కచ్చితంగా ఎల్లోవే.. ఏప్రిల్ మూడు కోసం వెయిట్ చేస్తున్నాం' అని ట్వీట్ చేసింది.
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరిగేది చెన్నైలో కాదు. అహ్మదాబాద్లో. మార్చి 1న జరిగే ఈ మ్యాచ్లో ధోనీ బరిలో దిగాని కూడా అది తమ చెన్నై ఫ్యాన్స్ ముందు కాదు. ఆ తర్వాత అంటే ఏప్రిల్ 3న చెన్నై జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్తో చెపాక్లో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోసమే స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. ధోనీ కూడా సీట్లకు పెయింట్ చేసి.. తనకు ఇచ్చిన స్ప్రే పెయింట్ డబ్బా పని చేస్తోందని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది.
ధోనీ గతేడాది చెన్నై తరఫున ఫర్వాలేదనిపించాడు. మొత్తం 14 మ్యాచులు ఆడిన అతను 123.40 స్ట్రైక్రేటు, 33.14 సగటుతో 232 పరుగులు చేశాడు. అయితే గతేడాది సీజన్ ప్రారంభానికి ముందే తను కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. జడేజాకు ఈ బాధ్యతలు అప్పగించాడు. కానీ జడ్డూ ఏమాత్రం ఆకట్టుకోలేదు. అతని కెప్టెన్సీలో జట్టు వరుసగా ఓటములు చవిచూసింది. దీంతో సీజన్ మధ్యలో మళ్లీ ధోనీనే కెప్టెన్సీ తీసుకున్నాడు. కానీ అప్పటికే వరుస ఓటములతో ఉన్న ఆ జట్టు చివరకు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో సీజన్ ముగించింది.