బీసీసీఐ కాంట్రాక్టులో దక్కని చోటు:
ధోనీకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్-2019 సెమీఫైనల్ తర్వాత ధోనీ మైదానంలో కనిపించలేదు. మళ్లీ ఆడతాడా లేదా అనే స్పష్టత తెలీదు. టీమిండియా తరఫున 2014 డిసెంబరులో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన ధోనీ.. 2019 ఫిబ్రవరిలో టీ20, జులైలో వన్డే మ్యాచ్ ఆడాడు. ధోనీ మైదానంలోకి దిగి దాదాపు ఆరు నెలలు కావొస్తుండడంతో అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు బీసీసీఐ నిరాకరించినట్లు సమాచారం తెలుస్తోంది.
సర్ప్రైజ్ ఇచ్చిన ధోనీ:
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ధోనీ ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మళ్లీ సాధన మొదలెట్టాడు. బీసీసీఐ కాంట్రాక్టు నిరాకరించిన రోజే మహీ శిబిరానికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపై క్రమం తప్పకుండా అతడు సాధనకు వస్తాడని సమాచారం తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్త సీజన్లో అదరగొట్టాలనే ఉద్దేశంతో ధోనీ ఉన్నాడు. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఐపీఎల్ తర్వాతే తుది నిర్ణయం:
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంతో ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ధోనీ మళ్లీ భారత్ తరఫున మ్యాచ్ ఆడడు, ధోనీ రిటైర్మెంట్ ఇస్తాడు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఐపీఎల్ 2020 తర్వాతే కెరీర్పై ధోనీ తుది నిర్ణయం తీసుకుంటాడని అతని సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందింది. టీ20 ప్రపంచకప్ కూడా ఆడుతాడని తెగలుస్తోంది. దీంతో ధోనీ అభిమానులకు శుభవార్త అందింది.
స్వయంగా గంగూలీనే:
కాంట్రాక్ట్ విషయం ధోనీకి స్వయంగా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీయే దీనిని చెప్పినట్లు తెలుస్తోంది. 'బోర్డు అత్యున్నత అధికారి ఒకరు కాంట్రాక్ట్ విషయం గురించి ధోనీతో మాట్లాడారు. తనకు అర్హత లేదు కాబట్టి తన పేరు పరిశీలించవద్దని అతనే చెప్పాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మళ్లీ అతను జట్టులోకి వస్తే కాంట్రాక్ట్ తిరిగి రావడం విషయం కాదు' అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు.