హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 10వ సీజన్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ ధోని ప్రదర్శనపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుమానం వ్యక్తం చేశాడు. ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
'ధోని వన్డే ఫార్మాట్లో ఛాంపియన్ ప్లేయర్. కానీ టీ20ల్లో ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శనే చేయగలడని నేనైతే అనుకోవడం లేదు. 10 ఏళ్ల టీ20 కెరీర్లో అతడు సాధించింది ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే' అని బుధవారమిక్కడ గంగూలీ అన్నాడు.

ఐపీఎల్ 10వ సీజన్లో ధోని ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ వైఫల్యాల ఆధారంగా గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'చాంపియన్స్ ట్రోఫీలో ధోనీ ఉండాలని కోరుకుంటా. అయితే, అతడు పరుగులు సాధించాలి' అని గంగూలీ పేర్కొన్నాడు. ధోనీ తన సత్తాచాటాల్సిన సమయం ఆసన్నమైందని మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
కెప్టెన్గా కాకుండా ఓ ఆటగాడిగా ధోని ఆడుతున్న తొలి ఐపీఎల్ టోర్నీ ఇదే. ఇప్పటివరకు పూణె ఆడిన మూడు మ్యాచ్ల్లో ధోని మ్యాచ్ని గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేదు. మూడు మ్యాచ్ల్లో వరుసగా 12 నాటౌట్, 5, 11 పరుగులు చేశాడు. 35 ఏళ్ల ధోని టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.