
ధోనికి మాత్రం ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదంటూ
వన్డేల్లో 9999 పరుగులు చేసి మరో మైలురాయికి కేవలం ఒక పరుగు దూరంలో ఉన్న ధోనికి మాత్రం ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ 332 వన్డేలు ఆడిన ధోనీ.. 10,173 పరుగులు చేశాడు. కానీ భారత్ తరఫున మాత్రం చేసింది 9999 పరుగులే. 2007లో ఆసియా ఎలెవన్ తరఫున 3 మ్యాచ్లు ఆడిన ధోని 174 పరుగులు చేశాడు. దీంతో.. ధోని వన్డే గణాంకాల్లో ఐసీసీ వాటిని పరిగణించలేదు. విండీస్తో జరగనున్న చివరి వన్డేలో మరో పరుగు చేస్తే... కోహ్లీ, సచిన్, ద్రవిడ్ లాంటి ఆటగాళ్ల సరసన ధోని చేరేవాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్
ఆఖరి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు జడేజా (4/34), బుమ్రా (2/11), ఖలీల్ (2/29) ధాటికి 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ శర్మ (63 నాటౌట్), విరాట్ కోహ్లీ (33 నాటౌట్) దూకుడుగా ఆడటంతో 14.5 ఓవర్లలోనే 105/1తో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ టార్గెట్ తక్కువగానే ఉండటంతో లక్ష్య ఛేదనలో జట్టు స్కోరు 6 పరుగుల వద్దే ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటయ్యాడు.

ధోని క్రీజులోకి వస్తాడని అంతా ఆశించిన అభిమానులు
దీంతో ధోని క్రీజులోకి వస్తాడని అంతా ఆశించారు. కానీ మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్కి రాగా అతనితో కలిసి రోహిత్ శర్మ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి వరకూ భారత్ జట్టు మరో వన్డే ఆడే అవకాశం లేకపోవడంతో అప్పటి వరకూ ధోనీ 10వేల పరుగుల రికార్డ్ అందుకునే అవకాశం లేకపోయింది. ఒకవేళ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీని పంపించి ఉండింటే ఆ మైలురాయిని ధోనీ చేరుకునేవాడు కదా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

3-1తో సిరిస్ను కైవసం చేసుకున్న టీమిండియా
ఆఖరి వన్డేలో విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరీస్ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకోనుంది. వైజాగ్ వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆఖరి వన్డేలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డుని అందుకోవడంలో విఫలమయ్యాడు. భువనేశ్వర్ ఈ మ్యాచ్కి ముందు 98 వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే చేశాడు. ఆఖరి వన్డేలో భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లు వేసి ఒక వికెట్ మాత్రమే తీయడంతో వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకోలేకపోయాడు.


Click it and Unblock the Notifications












