రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి గ్రూప్ తరఫున ప్రచారం చేసినందుకుగానూ తనకు ఇవ్వాల్సిన పారితోషికం మరియు ఓ ఇంటి విషయంలోనూ తనను మోసం చేసిందని ధోనీ పేర్కొన్నాడు. పారితోషికం తనకు చెల్లించాల్సిందిగా ఆమ్రపాలిని ఆదేశించాలని ధోనీ సుప్రీం కోర్టును విఙ్ఞప్తి చేశాడు. మరోవైపు రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ఉన్న పెంట్హౌజ్ను తనకు స్వాధీనపరచాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.
రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్నకు 2009-2016 మధ్య కాలంలో ధోనీ ప్రచారకర్తగా పలు ప్రకటనల్లో కనిపించాడు. అంతేగాక ఈ గ్రూపు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో ధోనీతో పాటు అతడి భార్య సాక్షి కూడా భాగస్వామ్యమయ్యారు. ఆమ్రపాలి గ్రూపునకు చెందిన చారిటబుల్ వింగ్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సాక్షి పాల్గొన్నారు. ఇన్వెస్టర్ల నుంచి రూ.2,765 కోట్లను వసూలు చేసి ఆ డబ్బును దారి మళ్లించినట్టు ఈ గ్రూప్పై ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ గ్రూప్నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చిన నిధులను నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఉపయోగించాలని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ధోనీకి చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు.పెంటౌజ్ విషయంలోనూ ధోనీకి యాజమాన్య హక్కులు కల్పించలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని ఎంఎస్ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మరి సుప్రీం కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.