న్యూజిల్యాండ్తో మొదటి టీ20కి ముందు టీమిండియాకు మంచి బూస్ట్ దొరికింది. ఈ మ్యాచ్ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ సారధి, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఉండేది ఇక్కడే. ఈ క్రమంలోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ధోనీని కలిసి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు పంచుకున్నాడు. అయితే ధోనీ వేరే ప్లాన్ వేశాడు. సడెన్గా జట్టు డ్రెస్సింగ్ రూంకు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు.
ధోనీ ఇలా డ్రెస్సింగ్ రూంకు వచ్చి కుర్రాళ్లను కలిసిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. 'ట్రైనింగ్ సెషన్ చూడటానికి ఎవరు వచ్చారో చూడండి' అనే క్యాప్షన్తో ఈ వీడియోను పంచుకుంది. టీమిండియా ఆటగాళ్లతో ధోనీ ముచ్చటించడం ఈ వీడియోలో చూడొచ్చు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అందరితో ధోనీ మాట్లాడాడు. వాషింగ్టన్ సుందర్కు కొన్ని సలహాలు ఇచ్చాడు.
టీమిండియా సిబ్బందిని కూడా పేరు పేరునా పలకరించాడు. అందరితో చక్కగా మాట్లాడాడు. వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్లో కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. అయితే పొట్టి ఫార్మాట్లో అయినా రాణించి, పరాభవం తప్పించుకోవాలని కివీస్ భావిస్తోంది. ఈ రెండు జట్లు ఈ సిరీస్లో ఎలా ఆడతాయా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అలాగే టీ20ల్లో అద్భుత ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆట కోసం కూడా ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. అయితే టీమిండియాకు ఓపెనర్లుగా ఎవరు వస్తారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ను దింపుతారని వార్తలు వస్తున్నాయి. అయితే జట్టుకు విధ్వంసకర ఓపెనింగ్ కావాలంటే పృథ్వీ షా, ఇషాన్ కిషన్ను పంపాలని నిపుణులు అంటున్నారు. దానికితోడు శ్రీలంకతో టీ20 సిరీస్లో గిల్ పెద్దగా రాణించకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు. మరి టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.