చెన్నై: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను శుక్రవారం సాయంత్రం కలిశారు. చెన్నైలో నిర్వహించిన 'ఎమ్ ఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్ర ప్రచార కార్యక్రమానికి ధోనీ హాజరయ్యారు. అనంతరం, ఈ సినిమా హీరో సుషాంత్ రాజ్ పుత్, మరికొందరితో కలిసి రజనీకాంత్ను ఆయన కలిశారు.
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి వారిద్దరూ కొంచెం సేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ధోనీ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'రజనీకాంత్ సార్తో' అని పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే కొన్ని లక్షల మంది వీక్షించారు.
ఇక 'ఎమ్ ఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్ర ప్రమోషన్లో భాగంగా ధోని తన అభిమాన హీరో ఎవరో చెప్పారు. శుక్రవారం చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆ విషయాన్ని వెల్లడించారు. తన రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించిన 'ఎమ్ ఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' సినిమా ప్రచారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ధోనీ శుక్రవారం చెన్నై వచ్చారు.
ఈ ప్రమోషన్ ఈవెంట్కు తమిళ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతికతో పాటు కుమారుడు కార్తి, కుమార్తె బ్రిందా శివకుమార్ హాజరయ్యారు. సూర్య పిల్లలతో కాసేపు ముచ్చటించిన ధోని 'నేను మీ తండ్రి (సూర్య) ఫ్యాన్ని తెలుసా?' అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. దీంతో కార్తి, బ్రిందా శివకుమార్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.