
హైదరాబాద్: బీసీసీఐ పాలకుల కమిటీ తీసుకున్న నిర్ణయం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాలిట శాపమైంది. ఇటీవలే భారత క్రికెటర్లకు పెద్ద మొత్తంలో జీతాలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ జీతాల పెంపు ప్రతిపాదనపై కోహ్లీ, ధోని, శాస్త్రిలు దగ్గరుండి బీసీసీఐ పాలకుల కమిటీతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
వీరి సమావేశం తర్వాత సరికొత్త ఫార్ములాకు బీసీసీఐ పాలకుల కమిటీ జీతాల పెంపుకు ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్న వారు టాప్ కాంట్రాక్ట్కు అర్హులు. ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ టాప్ కాంట్రాక్ట్కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆటగాళ్ల కాంట్రాక్ట్లను సీవోఏ... ఎ+, ఎ, బి, సిగా విభజించింది. జీతాల పెంపు ప్రతిపాదనకు ముందు గ్రేడ్-ఎ ఆటగాడికి ఏడాదికి రూ. 2 కోట్లు.. గ్రేడ్-బి ఆటగాడికి రూ. కోటి.. గ్రేడ్-సి ఆటగాడికి రూ. 50 లక్షలు ఇస్తున్నారు. టెస్టు మ్యాచ్ తుది జట్టులోని వారికి రూ. 15 లక్షలు.. వన్డే తుది జట్టులోని వారికి రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ తుది జట్టులోని వారికి రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ చెల్లిస్తోంది.
అయితే తాజాగా పెంచిన జీతాల ప్రకారం పెద్ద మొత్తంలో ఆటగాళ్లకు బీసీసీఐ వేతనాలను చెల్లించనుంది. దీని ప్రకారం అన్ని ఫార్మాట్లు ఆడుతున్న వారికి ఎ+ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో టాప్ కాంట్రాక్ట్కు ధోనీ అనర్హుడు కానున్నాడని వార్తలు వస్తున్నాయి.
రొటేషన్ పాలసీలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరమైన జడేజా, అశ్విన్ లాంటి ఆటగాళ్లను టాప్ కేటగిరీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతుండటాన్ని కమిటీ పరిగణనలో తీసుకోనుండమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఆటగాళ్ల గ్రేడింగ్ను సెలక్టర్లు షార్ట్లిస్ట్ చేయనున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.