చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. వరుస పరాజయాల అనంతరం గొప్పగా పుంజుకుని తిరిగి గెలుపు బాట పట్టింది. సొంతమైదానంలో చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పది పాయింట్లతో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10x4, 3x6) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో, 7x4, 1x6), శివమ్ దూబె (39*; 20 బంతుల్లో, 1x4, 4x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

అనంతరం ఛేదనలో సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. మార్క్రమ్ (32; 26 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే (4/27) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ (2/19), పతిరనా (2/17) చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్లో బ్యాటుతో మెరుపులు మెరింపించనప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో 150 విజయాల్లో భాగమైన తొలి ఆటగాడిగా ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ధోనీ 259 మ్యాచ్లు ఆడాడు. దాదాపు 60 శాతం మ్యాచ్ల్లో తమ జట్టు విజయాల్లో అతను భాగస్వామి అయ్యాడు. ఇక, ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ ఒక్కసారి కూడా ఔట్ కాకపోవడం విశేషం. మహీ తొమ్మిది మ్యాచ్ల్లో ఏడు సార్లు బ్యాటింగ్కు వచ్చాడు.
256 స్ట్రైక్రేటుతో అజేయంగా 96 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో రెండో అత్యధిక స్ట్రైక్రేటు ధోనీదే. కాగా, సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఈ అత్యుత్తమ ఫినిషర్కు రెండు బంతులు మాత్రమే ఎదుర్కొనే అవకాశం వచ్చింది. తొలి బంతిని బౌండరీకి బాదిన మహీ రెండో బంతికి సింగిల్ తీశాడు.