
ముంబై: కరోనా వైరస్ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తీవ్రంగా పడింది. కరోనా విజృంభణ కారణంగా గతేడాది యూఏఈలో ఐపీఎల్ లీగ్ జరిగింది. యూఏఈలో ఐపీఎల్ 2020 విజయవంతమైనా.. బ్రాండ్ విలువపై మాత్రం కరోనా ప్రభావం చూపింది. 2019 సీజన్తో పోలిస్తే 2020 ఐపీఎల్ విలువ 3.6 శాతం తగ్గింది. 2019లో ఐపీఎల్ క్రితం సీజన్ (2018) కంటే 7 శాతం పెరుగుదల నమోదు చేసి.. రూ. 47,500 కోట్లకు లీగ్ విలువను పెంచుకుంది. కానీ 2020 సీజన్ కరోనా దెబ్బ వల్ల రూ.45,800 కోట్లకు తగ్గింది. బుధవారం ఒక ప్రముఖ సంస్థ ఇందుకు సంబందించిన నివేదికను విడుదల చేసింది.
జట్ల పరంగా చూస్తే వరుసగా ఐదోసారి ముంబై ఇండియన్స్ తమ బ్రాండ్ విలువ (రూ.761కోట్లతో)ను నిలుపుకుంది. 5.9 శాతం క్షీణించినా.. అపర కుబేరుడు అనిల్ అంబానీ టీమ్ రూ.761 కోట్లతో టాప్లో ఉంది. మిగతా జట్ల విషయానికొస్తే.. చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) అత్యధికంగా -16.5 శాతం, కోల్కతా నైట్రైడర్స్ -13.7 తమ బ్రాండ్ విలువను కోల్పోయినట్లు నివేదికలో తేలింది. చెన్నై, కోల్కతాలు వరుసగా రూ.611 కోట్లు, రూ.543 కోట్లతో టాప్-3లో నిలిచాయి.
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. ఐపీఎల్తో తిరిగి తమ అనుబంధాన్ని కొనసాగించనుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వివో కంపెనీ తమ హక్కులను నిలబెట్టుకుంది. ఇదివరకే బీసీసీఐతో కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 వరకు వివో.. లీగ్ ప్రధాన స్పాన్సర్గా కొనసాగనుంది. నిజానికి 2018లో బోర్డుతో ఐదేళ్ల ఒప్పందానికి వివో రూ.2190 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. దీని ప్రకారం ప్రతి ఏడాది స్పాన్సర్షిప్ హక్కుల కింద బోర్డుకు రూ.440 కోట్లు చెల్లించింది. అయితే గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికుల పాశవిక దాడిలో భారత సైనికులు అమరులవడంతో దేశవ్యాప్తంగా చైనా కంపెనీల ఉత్పత్తులపై నిషేధం విధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీంతో వివో టైటిల్ స్పాన్సర్గా కొనసాగలేదు.
వివో తప్పుకోవడంతో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020కి 'డ్రీమ్ ఎలెవన్' స్పాన్సర్గా వ్యవహరించింది. ప్రస్తుతం పరిస్థితులలో మార్పులు రావడంతో మళ్లీ వివోతో ఒప్పందం కొనసాగించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. వచ్చే నెల 9న మొదలయ్యే ఐపీఎల్ 2021 కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వివో కంపెనీ భారత డైరెక్టర్ నిపున్ మార్యా అన్నారు. ఇరు పక్షాల కుదిరిన ఒప్పందాన్ని అనుసరించే గత సీజన్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్నామని, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు సద్దుమణిగాయన్నారు.