చెన్నై నుంచి రాంచీకి:
ఐపీఎల్ వాయిదా పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం రాంచీకి పయనమై వెళ్లాడు. కరోనా వేగంగా విజృంభిస్తుండడంతో.. చెన్నై ఫ్రాంఛైజీ తమ ప్రాక్టీస్ సెషన్కు శనివారం ముగింపు పలికింది. దీంతో ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న కెప్టెన్ ధోనీ సహా అంబటి రాయుడు, సురేశ్ రైనా, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు శనివారం చెన్నైను వీడి తమ ఇళ్లకు బయలుదేరారు. ఇప్పటికే అందరూ ఆటగాళ్లు కుటుంబం చెంతకు చేరారు.

వీడ్కోలు కార్యక్రమం:
ధోనీ రాంచీకి బయలుదేరేముందు చెన్నై జట్టు యాజమాన్యం మహీకి చిన్న వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిదంబరం స్టేడియంలో అభిమానులతో కాసేపు సరదాగా గడిపాడు. కొందరికి ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఫొటోలు దిగాడు. ఓ చిన్నారి అభిమానికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మహీ బారికేడ్ దగ్గరికి వెళ్లి మరీ ఓపికగా తన అభిమానులందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆపై వారితో కాసేపు ముచ్చటించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విటర్లో పోస్టు చేసింది. 'తలా.. మళ్లీ చెన్నైకు రావాలంటే ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత రావాల్సిందే' అని రాసుకొచ్చింది.

దద్దరిల్లిన మైదానం:
ఈ నెల 2న చిదంబరం స్టేడియంలో ధోనీ క్రికెట్ సాధన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నెట్స్లో బ్యాటింగ్చేస్తూ.. హిట్టింగ్తో ఫ్యాన్స్ను అలరించాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో.. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. అతడు బ్యాటు పట్టి అడుగుపెట్టే సమయంలో చిదంబరం స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. అభిమానులు 'ధోనీ..ధోనీ.. ధోనీ.. ధోనీ' అంటూ నినాదాలు చేశారు.

ధోనీ భవిష్యత్ ఏంటో నాతో చెప్పాడు:
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మెన్గా ఇటీవలే ఎమ్మెస్కే ప్రసాద్ పదవి కాలం ముగిసింది. తాజాగా సీఏసీ బృందం బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్గా సునీల్ జోషిని ఎంపికయిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. 'ఎంఎస్ ధోనీ భవిష్యత్పై చాలా స్పష్టతతో ఉన్నాడు. ఆ విషయాన్ని నాతో పాటు జట్టు యాజమాన్యంతోనూ చెప్పాడు. దాన్ని రహస్యంగా ఉంచాలి కాబట్టి చెప్పలేకపోతున్నా. మా మధ్య జరిగిన సంభాషణ చాలా బాగా జరిగింది. అయితే అది మా మధ్యే ఉండిపోతుంది' అని ఎమ్మెస్కే అన్నారు.

సెమీస్ ఓటమి నుంచి క్రికెట్కు దూరం:
గత ఏడాది జూలై 9న న్యూజిలాండ్తో వన్డే ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత ధోనీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. బీసీసీఐకి సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఇక గతేడాది చివర నుండే పలుమార్లు అతడి రిటైర్మెంట్పై వార్తలొచ్చాయి. అయితే 38 ఏళ్ల మహీ తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు ఐపీఎల్ వేదికని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












