MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ తలైవా ఎంఎస్ ధోనీ క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ ఆటల పట్ల తన ప్రేమను విడిచిపెట్టలేదని మరోసారి నిరూపించుకున్నారు. చెన్నై ప్రజలకు గొప్ప బహుమతిని అందిస్తూ ధోనీ ఇటీవల '7Padel' అనే కొత్త ప్యాడెల్ బ్రాండ్ను ప్రారంభించారు. దీని మొదటి సెంటర్ చెన్నైలోనే తెరవబడింది. ఇది చెన్నైతో ధోనీకి ఉన్న ప్రత్యేక అనుబంధానికి నిదర్శనం.
"7Padel"లో ప్రత్యేకతలు ఏమిటి?
20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్లో మూడు అత్యాధునిక ప్యాడెల్ కోర్టులు, ఒక పికిల్బాల్ కోర్టు ఉన్నాయి. అంతేకాకుండా ఆటగాళ్ల కోసం అనేక ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించారు. ఇందులో స్పిమ్మింగ్ పూల్, జిమ్, కేఫ్, రికవరీ రూమ్ వంటివి ఉన్నాయి. ధోనీ ఫిట్నెస్ పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తారో ఈ సెంటర్లో కల్పించిన సౌకర్యాలు చూస్తే అర్థమవుతుంది. ప్యాడెల్ అనేది టెన్నిస్ లాంటి ఒక రాకెట్ ఆట, ఇది చిన్న కోర్టులో ఆడతారు. దీనికి ఇటీవల మంచి ఆదరణ లభిస్తుంది.

ధోనీ, రుతురాజ్, అనిరుధ్ ఒకే వేదికపై
ఈ కొత్త ప్యాడెల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ధోనీతో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అనిరుధ్తో కలిసి ధోనీ ప్యాడెల్ ఆడుతున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంది. 44 ఏళ్ళ వయసులో కూడా ధోనీ అద్భుతమైన ఫిట్నెస్, చురుకుదనం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఐపీఎల్లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త వ్యాపారంతో ఆయన తన అభిమానుల జీవితంలో మరింత భాగమవుతున్నారు. ఇది కేవలమ వ్యాపారం మాత్రమే కాదు, చెన్నై ప్రజలకు ధోనీ ఇచ్చిన ఒక ప్రేమపూర్వక బహుమతి.