
హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న 2019 వరల్డ్ కప్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉంటాడా లేదా? అనే విషయానికి తెరపడింది. ఆ వరల్డ్ కప్ వరకు ధోని జట్టులో ఉండటం ఖాయమని తెలిసిపోయింది. ఈ విషయంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టత ఇచ్చాడు.
శనివారం దక్షిణాఫ్రికాతో తలపడే వన్డే జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే మాట్లాడుతూ 'మేం భారత్-ఏ జట్టు పర్యటనల ద్వారా యువ వికెట్ కీపర్లను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొంచెం అటు ఇటుగా వచ్చే వరల్డ్ కప్ కోసం ధోనిని కొనసాగించడానికే కట్టుబడి ఉన్నాం' అని అన్నాడు.

'ఇప్పటికీ ధోనినే అత్యుత్తమ వికెట్ కీపర్ అని భావిస్తున్నాం. ప్రస్తుత శ్రీలంక టీ20 సిరీస్లో ధోని స్టంపింగ్లు, క్యాచ్లు అద్భుతం. అతడితో వేరెవ్వరికీ పోలికే లేదు. భారత క్రికెట్ సంగతి వదిలేద్దాం. ప్రపంచ క్రికెట్ మొత్తంలోనూ ధోనికి దగ్గరగా వచ్చే వికెట్ కీపర్ ఎవరూ లేరు' అని ఎమ్మెస్కే అన్నాడు.
ఇక, ధోనికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న రిషబ్ పంత్, సంజు శాంసన్ల గురించి ఎమ్మెస్కే ప్రసాద్ వద్ద విలేకరులు ప్రస్తావించగా... 'నిజాయితీగా చెప్పాలంటే ఆ కుర్రాళ్లు ఇంకా మేం అనుకున్న స్థాయికి రాలేదు. భారత్-ఏ తరఫున వారికి అవకాశాలు ఇస్తున్నాం. వారిని మరింత తీర్చిదిద్దాలి' అని చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.