
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జట్టులోని మిగతా ఆటగాళ్లు ఓ మహిళా అభిమానికి ఆటోగ్రాఫ్ ఇవ్వకుండా వెళ్లిపోతుంటే కోహ్లీ మాత్రం ఆగి మరీ ఆ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే... మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య మంగళవారం లీడ్స్ వేదికగా మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులోని ఆటగాళ్లు బస చేసిన హోటల్ నుంచి స్టేడియానికి బయల్దేరారు.
ఆటగాళ్లు బయటకు వచ్చే సమయంలో హోటల్ బయట ఓ మహిళా అభిమాని ఆటగాళ్లను ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరింది. తొలుత వచ్చిన ధోని ఆమెకు ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు. చివర్లో వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఆ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. మరోవైపు మిగతా ఆటగాళ్లు ఆటోగ్రాఫ్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో అంటూ నెటిజన్లు ట్విట్టర్లో జోకులు పేల్చుతున్నారు.