వయసు మీద పడుతున్నా తన ఆటలో ఏ మాత్రం పదును తగ్గదని 42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి నిరూపించాడు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ సీఎస్కే మాజీ కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది నాలుగు బంతుల్లో అజేయంగా 20 పరుగులు సాధించాడు.
ధోనీ చేసిన ఈ 20 పరుగులే చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఎందుకంటే సీఎస్కే నిర్ణయించిన భారీ టార్గెట్ ఛేజింగ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతోనే ఓటమిపాలైంది. దీంతో ధోనీ ఇన్నింగ్స్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిందని అభిమానులతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అంగీకరించాడు.

అయితే ముంబై-సీఎస్కే మ్యాచ్లో ధోనీ అరుదైన ఘనతలు సాధించాడు. క్రీజులోకి వచ్చి హార్దిక్ పాండ్య బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ధోనీ సంచనల రికార్డు నమోదుచేశాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన తొలి భారత ఆటగాడిగా ధోనీ చరిత్రకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో మహీకి ముందు ఏ ఇండియన్ ప్లేయర్ ఈ ఫీట్ సాధించలేదు.
అంతేగాక ధోనీ మరో రికార్డు నెలకొల్పాడు. ఓ జట్టు తరఫున 250 టీ20 మ్యాచ్లు ఆడిన రెండో ప్లేయర్గా ధోనీ రికార్డులకెక్కాడు. ముంబై మ్యాచ్తో సీఎస్కే తరఫున ధోనీ 250 మ్యాచ్ల క్లబ్లో చేరాడు. దీనిలో ఛాంపియన్స్లీగ్ టీ20లో ధోనీ ఆడిన 24 మ్యాచ్లు కూడా ఉన్నాయి. కాగా, ఒకే ఫ్రాంచైజీ తరఫున 250 టీ20 మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే. ఈ జాబితాలో ధోనీ ముందు విరాట్ కోహ్లి నిలిచాడు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్ 243, సీఎల్టీ20లో 15 మ్యాచ్లు ఆడాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6), ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సత్తాచాటారు. అనంతరం ముంబై 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది.