

హైదరాబాద్: టీమిండియా ఒకేసారి జట్టులో ఇద్దరు స్టార్ ప్లేయర్లను చూసింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటివరకు టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించిపెట్టారు.
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. టెస్టులకు ధోని వీడ్కోలు పలికినప్పటికీ, పరిమిత ఓవర్లలో కొనసాగుతూ యువ క్రికెటర్లకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు.
తాజాగా దేశవాళీ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్ జట్టుకు కోచ్గా నియమింపబడిన టీమిండియా వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్... ధోనిని టీమిండియాకు పిల్లర్గా అభివర్ణించాడు. వికెట్ కీపర్, బ్యాట్స్ మన్గా జట్టు విజయాల్లో పాలుపంచుకోవడంతో పాటు యువ క్రికెటర్లకు మెంటార్గా వ్యవహారిస్తున్నాడని అన్నాడు.
జీజీఎమ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో అండర్-23 క్రికెటర్ల కోసం నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ "భారత క్రికెట్కు ధోని పిల్లర్ లాంటివాడు. మైదానం బయట యువ క్రికెటర్లకు అతడు ఇచ్చే సలహాలు అమోఘం. నేను ఆడిన కెప్టెన్లలో ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. కెప్టెన్గా గంగూలీ ఏదైతే చేశాడో.. అది ప్రత్యేకం" అని అన్నాడు.
ఇక, ధోని నాయకత్వంలోని టీమిండియా విజయాలపరంగా చూస్తే అద్భుతాలు చేసిందని కొనియాడాడు. ఐసీసీ నిర్వహించే మూడు ప్రతిష్టాత్మక టోర్నీలు (టీ20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లను గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనియే అని ప్రశంసలతో ముంచెత్తాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో సైతం నంబర్ వన్ స్థానాన్ని సైతం దక్కించుకుందని పేర్కొన్నాడు.
"విజయాల పరంగా ధోని అద్భుతం. వన్డే వరల్డ్ కప్ లేదా టీ20 వరల్డ్ లేదా క్రికెట్లో మూడు ఫార్మాట్లలో టీమిండియా అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆ విజయాలు కొనియాడతగ్గవి" అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. గత కొన్నాళ్లుగా టీమిండియా విరాట్ కోహ్లీ నడిపిస్తున్న తీరుపై కూడా పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.