హైదరాబాద్: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఉన్న ధోని రికార్డుని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పకుండా అధిగమిస్తాడని ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి పలు విషయాలు వెల్లడించాడు.
'కెప్టెన్గా కోహ్లీ ఎదుగుతున్న తీరు ధోనిని అందుకునేలా ఉంది. కోచ్గా, ప్లేయర్గా, కామెంటేటర్గా గత 35 ఏళ్లుగా క్రికెట్తో ముడిపడి ఉన్నాను. సచిన్ టెండూల్కర్ని మినహాయిస్తే, కోహ్లీ లాగా రికార్డులు బద్దలు కొట్టే ఆటగాడిని చూడలేదు. కెరీర్ సగంలోనే అతడు దిగ్గజాలను చేరుకున్నాడు. అసలు కోహ్లీ ఎక్కడ ఆగుతాడో అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ధోనీ ఎదిగిన బాటలోనే కోహ్లీ పయనిస్తున్నాడు. కెప్టెన్గా డాన్ బ్రాడ్మన్ 101.51, స్టీవ్స్మిత్ 73.27 తర్వాత అత్యుత్తమ సగటు కోహ్లీదే (61.09). అతడు వారిద్దరినీ దాటేయడం మనం చూడొచ్చు' అని రవిశాస్త్రి అన్నాడు.

గతంలో ఏ భారత జట్టుకి సాధ్యం కాని ఘనతలను సాధించే సత్తా ఇప్పటి జట్టుకు ఉందని శాస్త్రి చెప్పాడు. గత రెండేళ్లుగా ఇదే జట్టు కలిసి ఆడుతోందని, మంచి ఫలితాలను సాధించడానికి ఇది బాగా కలిసొస్తుందని శాస్త్రి చెప్పాడు. 22 ఏళ్ల తర్వాత 2015లో ఇదే జట్టు శ్రీలంకలో 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
గత రెండు దశాబ్దాలలో ఎంతోమంది గొప్ప క్రికెటర్లు భారత జట్టులో ఉన్నప్పటికీ, ఎవరికీ ఈ ఘనత సాధ్యం కాలేదని అన్నాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా 60 టెస్టు మ్యాచ్లాడగా అందులో 27 టెస్టుల్లో విజయం సాధించగా, 18 టెస్టుల్లో ఓటమి, 15 టెస్టులు డ్రాగా ముగిశాయి.
'ధోని భారత్కు రెండు వరల్డ్ టైటిళ్లు (వరల్డ్ కప్, వరల్డ్ టీ20) అందించాడు. మరో వరల్డ్ టీ20లో జట్టుని రన్నరప్గా నిలిచేలా చేశాడు. మరో రెండు వరల్డ్ టీ20ల్లో సెమీ ఫైనల్స్ ఆడటంతో పాటు, వరల్డ్ కప్లో సెమీ ఫైనల్ కూడా ఆడేలా చేశాడు. పరిమితి ఓవర్ల క్రికెట్లో అతడి రికార్డులు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఇప్పుడు కోహ్లీ కూడా అదే దారిలో పయనిస్తున్నాడు' అని రవిశాస్త్రి అన్నాడు.
కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటివరకు 20 టెస్టులకు పైగా కెప్టెన్సీ వహించగా భారత్ 17 టెస్టు విజయాలను సొంతం చేసుకోగా, మూడు టెస్టుల్లో ఓటమి, ఏడు టెస్టులు డ్రాగా ముగిశాయి. టెస్టుల్లో ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలు (45 శాతం), గంగూలీ 49 టెస్టుల్లో 21 విజయాలు (42.85) అందించారని రవిశాస్త్రి పేర్కొన్నాడు.