
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీని ప్రతి భారత క్రికెట్ అభిమాని ఆస్వాదించాడు. ధోని ఓ లెజెండ్. ఆ విషయం ప్రతి ఒక్క భారతీయడు అంగీకరిస్తాడు. అయితే, ప్రస్తుత క్రికెట్లో ధోనీ పరిమిత ఓవర్ల ఆటలో అత్యుత్తమ నాయకుడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు.
తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వాన్ మాట్లాడుతూ "అంతర్జాతీయ క్రికెట్లో ధోని సారథ్య బాధ్యతలు స్వీకరించకున్నా... మా తరంలో నేను చూసిన అత్యుత్తమ కెప్టెన్ అతడే. వికెట్ల వెనుక నుంచి ఆటను అర్థం చేసుకునే విధానం, ఒత్తిడిని తట్టుకునే విధానం, బ్యాటింగ్ చేయడంలో నైపుణ్యం" అని అన్నాడు.
కాగా, ధోని నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ సైతం అదే స్థాయిలో రాణిస్తున్నాడని మైకేల్ వాన్ అన్నాడు. "టెస్టుల్లో విరాట్ కోహ్లీ బిజీగా ఉంటూ, ఉత్సాహంగా కనిపిస్తాడు. కోహ్లీ జీవితాంతం అద్భుత బ్యాట్స్మన్గా కొనసాగుతాడు. కోహ్లీ కెప్టెన్సీ చేసే పద్ధతి చాలా బాగుంటుంది" అని వాన్ చెప్పుకొచ్చాడు.
ఇక, కెప్టెన్సీ గురించి వాన్ "నాయకత్వమనేది మైదానం బయటే ఎక్కువగా కనపడుతుంది. అక్కడే కెప్టెన్ వ్యూహాత్మకంగా ఆలోచిస్తాడు. ఇతర ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం కెప్టెన్కు తేలికగా మారుతుంది. కెప్టెన్కు క్రికెట్పై పూర్తి అవగాహన ఉండడంతో పాటు ఆటగాళ్లను మేనేజ్ చేసే సత్తా ఉండాలి" అని అన్నాడు.
"మైదానం వెలుపల ప్రజలతో వ్యవరించే తీరు, మీడియాతో మాట్లాడే పద్ధతి, జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించడం వంటివి నాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక ఉత్తమ కెప్టెన్ తమ బృందానికి రాబోయే కొద్ది నెలలు, సంవత్సరాలలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారో లక్ష్యాలను నిర్దేశిస్తాడు" అని వాన్ తెలిపాడు.
2014లో టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన ధోని.... భారత్కు 2007 టీ20 వరల్డ్కప్తో పాటు 2011 వన్డే వరల్డ్కప్ను అందించాడు. 2013లో భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ఐసీసీ నిర్వహించే మూడు ప్రతిష్టాత్మక ట్రోఫీలు నెగ్గిన ఏకైక కెప్టెన్ కూడా ధోనియే.