హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2019 వరల్డ్ కప్ వరకు ఆడాలనుకునే వారి జాబితాలో తాజాగా మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ చేరాడు. ప్రస్తుత భారత జట్టులో ధోని చాలా విలువైన ఆటగాడని, అతన్ని ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేయొద్దంటూ సెలక్షన్ కమిటీకి గంగూలీ హితవు పలికాడు.
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ధోని టాప్ ఆర్డర్ విఫలమైన తరుణంలో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక సమయాల్లో ఇప్పటికే ఎన్నోసార్లు తానేమిటో నిరూపించుకుని జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన ధోనికి పరీక్ష లాంటిది పెట్టవద్దని గంగూలీ సెలక్టర్లకు సూచించారు.

'ఆ తరహా ఆటగాళ్లకు పరీక్ష అనేది ఉండదు. ఆ రకంగా చేస్తే వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టినట్లే అవుతుంది. ధోని రికార్డులే అతను ఏమి చేసాడో చెబుతాయి. ధోని వంటి కీలక ఆటగాడి అనుభవాన్ని ఉపయోగించే యత్నం మాత్రమే చేద్దాం' అని గంగూలీ పేర్కొన్నాడు.