చెన్నై: త్వరలో జరుగనున్న ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై ఫుట్బాల్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎఫ్సి గోవా జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు.
మొత్తంగా చూస్తే ఐఎస్ఎల్లో జట్లు కొనుగోలు చేసిన క్రికెటర్లలో ధోనీ నాల్గవవాడు. ఈ లీగ్ 8 నగరాల్లో జరుగనుంది. కాగా, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సి సహ యజమానిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నాడు. మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూల్ అట్లాటికో డే కోల్కతా యజమానులలో ఒకరిగా ఉన్నాడు.

హెర్త్రోబ్ ఆఫ్ చెన్నై, హర్త్రోబ్ ఆఫ్ ది నేషన్, ఇప్పుడు చెన్నైయిన్ ఎఫ్సి సహ యజమాని అయిన ఎంఎస్ ధోనీకి స్వాగతం సుస్వాగతం అంటూ ట్విట్టర్లో చెన్నై ఫ్రాంఛైజీ ట్వీట్ చేసింది.
చెన్నై ఫ్రాంఛైజీని చెన్నైయిన్ ఎఫ్సిగా నామకరణం చేశారు. ఇటాలియన్ డిఫెండర్, ప్రపంచ కప్ విజేత మార్కో మ్యాటరజ్జి ప్లేయర్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. తాను చాలా చిన్న వయస్సులోనే ఓ జట్టుకు యజమానిగా వ్యవహరించడం ఆనందంగా ఉందని కోహ్లీ తెలిపాడు. తనకు ఫుట్ బాల్ ఆట అంటే ఇష్టమని చెప్పిన కోహ్లీ.. మనదేశంలో ఫుట్బాల్ అభివృద్ధిని చూడాలని అన్నాడు.