ధోని పాత్రపై ఎలాంటి సందేహానికి తావు లేదు
ఈ నేపథ్యంలో ధోనిపై వస్తున్న విమర్శలపై భువీ స్పందించాడు. టీమిండియాలో ధోని పాత్రపై ఎలాంటి సందేహానికి తావు లేదని భువీ చెప్పుకొచ్చాడు. 'ధోనీ పాత్ర గురించి ఒక టీమ్గా మేం అంత ఆలోచించడం లేదు. అతడి రికార్డులు చూడండి, అతనో లెజెండ్. అతను ఏం చేసినా దేశం కోసమే. ధోనీపై జట్టులో ఎవరికీ ఏ సందేహాలు లేవు' అని భువీ అన్నాడు.
ఐదో స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడమే కారణమా?
రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమికి జట్టులో ఐదో స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడమే కారణమా? అని ప్రశ్నించగా.. ఈ ఓటమికి బౌలర్లను బాధ్యులను చేయడం సరికాదని, కివీస్ జట్టు బాగా ఆడటం వల్ల గెలిచిందని భువనేశ్వర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
1-1తో సిరిస్ సమం
ఇదిలా ఉంటే మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో మూడో టీ20లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మూడో టీ20కి వరుణుడి ముప్పు
మరోవైపు మూడో టీ20కి వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ముందుస్తు హెచ్చరికలు అటు క్రికెట్ మ్యాచ్ నిర్వహకుల్ని, ఇటు అభిమానుల్ని కలవరపరుస్తున్నాయి. ఇటీవల ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
20 నిమిషాల్లోపే మైదానం సిద్ధం చేయగలం
తాజా వర్ష సూచన నేపథ్యంలో కేరళ క్రికెట్ సంఘం స్పందించింది. 'స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ ఉంది. సాయంత్రం వర్షం కురిస్తే ఆగిపోయిన 20 నిమిషాల్లోపే మైదానం సిద్ధం చేయగలం. ఆదివారం రిహార్సల్ సైతం చేశాం. రోజు మొత్తం వర్షం కురిసినా నిమిషాల వ్యవధిలోనే సిద్ధం చేయగలం' అని కేరళ క్రికెట్ సంఘం కార్యదర్శి జయేశ్ జార్జ్ తెలిపారు.