అసలేం జరిగింది?
అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికే వాట్సన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆర్చర్ వేసిన సూపర్ త్రోకు సురేశ్ రైనా (4) రనౌటయ్యాడు. దీంతో మూడు ఓవర్లకు గాను చెన్నై 10 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్థితిలో భారీ షాట్కు పోయిన డుప్లెసిస్ (7) ఉనాద్కత్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై
ఆ తర్వాత కేదార్ జాదవ్(1) వెనుదిరిగాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి అంబాటి రాయుడు ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. రాజస్థాన్ బౌలర్ పరాగ్ బౌలింగ్లో ధోని చెలరేగాడు. ఈ క్రమంలో హాఫ్సెంచరీ అనంతరం భారీ షాట్కు ప్రయత్నించిన రాయుడు(57) గోపాల్ పట్టిన సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు.
ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు
చెన్నై విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆ జట్టు ఒక్కసారిగా ఒత్తిడిలోకి పోయింది. అయితే, క్రీజులో ధోని ఉండడంతో అభిమానులు చెన్నై గెలుస్తుందనే ధీమాతోనే ఉన్నారు. ఇక, ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ సాంట్నర్ 2 పరుగులు చేశాడు. అయితే అంపైర్ దీనిని తొలుత నోబాల్గా ప్రకటించగా, ఆ తర్వాత లెగ్ అంపైర్ కాదనడంతో చేయి దించాడు.
నిబంధన 2.20 అతిక్రమించిన ధోని
ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్-స్ట్రైక్ ఎండ్లో ఉన్న రవీంద్ర జడేజా తొలుత అంపైర్లను ప్రశ్నించాడు. అనంతరం డగౌట్లో కూర్చుని ఉన్న కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. అంపైర్లు అది నోబాల్ కాదనడంతో ధోని నిరాశగా డగౌట్ చేరాడు. అయితే మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోని ఐపీఎల్ నిబంధన 2.20 అతిక్రమించాడని అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.