

హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్తో మ్యాచ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరిగా రాణించలేకపోయాడు. ఈ విషయంపై నెటిజన్లతో పాటు పలువురు సీనియర్లు సైతం ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. వారికి ధీటుగా కోహ్లీతో పాటు సునీల్ గవాస్కర్లు ధోనీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు వారితో పాటుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ఏకీభవిస్తున్నాడు.
ఈ క్రమంలో.. 'ధోనీ.. రెండు మ్యాచ్లే కదా సరిగ్గా ఆడలేకపోయింది. దీనికే అతడిపై ఇంతగా విమర్శలు గుప్పించడం సరికాదు' అని అంటున్నాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ హస్సి. ఈ ఏడాది ఐపీఎల్లో హస్సి చెన్నై సూపర్ కింగ్స్కు బ్యాటింగ్ కోచ్గా సేవలు అందించాడు. అంతకుముందు ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ హస్సి ఆడాడు.
ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న హస్సీ.. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్)కు ప్రచార కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ ఫామ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు హస్సి మాట్లాడుతూ... 'ధోనీ ఇంగ్లాండ్ పర్యటనలో రెండు ఇన్నింగ్స్లే కదా సరిగ్గా ఆడలేకపోయింది. ధోనీ ఏంటో, ఎలా ఆడతాడో మన అందరికీ తెలుసు. మధ్యలో కొన్ని సార్లు ఏ ఆటగాడైనా గాడి తప్పుతాడు. ఇది అందరికీ జరిగేదే.'
'ధోనీ తప్పక తిరిగి తన ఫామ్ను అందుకుంటాడు. ఎన్నో ఏళ్ల పాటు అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్లు సరిగా ఆడలేదన్న కారణంగా అతడు అందించిన విజయాలను మరిచిపోతే ఎలా. వచ్చే ఏడాది ప్రపంచకప్కు అతడి సేవలు భారత జట్టుకు ఎంతో అవసరం. మ్యాచ్ చివర్లో వికెట్ల వెనుక నిల్చుని బౌలర్లకు ధోనీ ఇచ్చే సలహాలు ఎంతో అమూల్యమైనవి. అవన్ని మరవొద్దు' అని హస్సి చెప్పుకొచ్చాడు.