
రనౌట్కు 16 ఏళ్లు:
ఈ దశాబ్దంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోజు ఇదే. డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా మహీ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రం మ్యాచ్ ధోనీకి ఓ పీడకలగా మిగిలిపోయింది. బంగ్లాదేశ్తో జరిగిన ఆనాటి మ్యాచ్లో మహీ తాను ఆడిన తొలి బంతికే రనౌట్ అయి.. గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. తపష్ బైష్యా, ఖాలీద్ మసూద్లు కలిసి మహీని రనౌట్ చేశారు. దీంతో ఎన్నో ఆశలతో మైదానంలోకి వచ్చిన ధోనీకి నిరాశే ఎదురైంది. ఆ రనౌట్కు నేటికి 16 ఏళ్లు.

2007లో సారథ్య బాధ్యతలు:
తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డకౌట్ కాగా.. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో తర్వాతి మ్యాచుకు జట్టులో చోటు ఉంటుందో లేదో అనుమానం మహీ బుర్రలో మెదిలింది. అయితే మహీపై నమ్మకం ఉంచిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరో అవకాశం ఇచ్చాడు. మూడో స్థానంలో వచ్చి ఏకంగా భారీ సెంచరీ చేశాడు. ఆపై మరో సెంచరీ. ఇక కొద్దిరోజుల్లోనే అతని విలువేంటనేది టీమిండియాకు అర్థమైంది. అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోని ధోనీ మంచి ఫినిషర్గా నిలిచాడు. 2007లో సారథ్య బాధ్యతలు అందుకుని మరింత ఎత్తుకు ఎదిగాడు. ఆపై క్రికెట్ చరిత్రలోనే గొప్ప కెప్టెన్ల సరసన చోటు సంపాదించాడు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోపీలను సాధించిపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు.

రనౌట్తోనే కెరీర్ ముగింపు:
విచిత్రంగా ఎంఎస్ ధోనీ ఏ రనౌట్తో కెరీర్ను ప్రారంభించాడో యాదృశ్చికంగా అదే రనౌట్తో కెరీర్ను ముగించాడు. 2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మార్టిన్ గప్టిల్ వేసిన డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత మహీ ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. తన రిటైర్మెంట్పై ఎన్నో రకాల వార్తల వస్తున్న నేపథ్యంలో.. ఆగస్టు 15, 2020న మహీ తన ట్విటర్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి అతని అభిమానులను ఊహించని షాక్ ఇచ్చాడు.

2021 ఐపీఎల్లో ఆడనున్న మహీ:
రిటైర్మెంట్ అనంతరం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2020లో ఆడాడు. ఆ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరించింది. మహీ కెప్టెన్సీలోని చెన్నై జట్టు 14 మ్యాచుల్లో 6 విజయాలు, 8 ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ మెగా టోర్నీకి కూడా దూరమవుతాడని వరాతలు వచ్చాయి. ఈ విషయంపై లీగ్ చివరి మ్యాచ్ టాస్ సమయంలో చెన్నై సారథి నేరుగా స్పందించాడు. 2021 ఐపీఎల్లో ఆడుతానని స్వయంగా చెప్పాడు. దీంతో అభిమానులు సంతోషపడ్డారు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ధోని టీమిండియా తరపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు.

రికార్డు సృష్టించిన ధోనీ రిప్లే:
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీకి అభినందనలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు పేజీల లేఖను రాసారు. దీనిపై స్పందించిన మహీ.. ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని.. మోదీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. అయితే ఈ రిప్లే ట్వీట్ ట్విటర్లో రికార్డు సృష్టించింది. అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్గా నిలిచింది.

ఇప్పటివరకు రూ.137 కోట్లు:
2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి ఏడాదికి రూ.6 కోట్లు తీసుకున్న ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్ వరకల్లా రూ.15 కోట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకూ 13 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. ఐపీఎల్ ఒప్పందాల ద్వారా మహీ రూ.137 కోట్లు ఆర్జించాడు. గతేడాది వరకు ఎండార్స్ మెంట్స్, బీసీసీఐ నుంచి కూడా ధోనీకి భారీ మొత్తంలో అందేది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో 'మహర్షి'లా తన పొలం పనులు చేసుకున్న ధోనీ.. తాత్కాలికంగా వాణిజ్య ప్రకటనల ఒప్పందాలకు దూరంగా ఉంటున్నాడు.


Click it and Unblock the Notifications












