
దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీని మాస్టర్ మైండ్ అని పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు మైదానంలో ప్రణాళికలు రచించి వాటిని అమలుచేస్తాడని స్టోయినిస్ అన్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోయినిస్.. చెన్నైతో ఆడేటప్పుడు ధోనీ తనని ఎలా కట్టడి చేస్తాడనే విషయాలు ఓ సందర్భంలో తనతో పంచుకున్నాడన్నాడు. అయితే ఆ విషయంలో తనకు ఓ క్లారిటీ లేదన్నాడు. ధోనీ కాంప్లిమెంట్ ఇచ్చాడో.. తక్కువచేసి మాట్లాడాడో అర్ధం కాలేదని ఆసీస్ ఆల్రౌండర్ చెప్పాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన మార్కస్ స్టాయినిస్.. చెన్నైతో బరిలోకి దిగినప్పుడు ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ను ఎలా సెట్ చేస్తాడో తనకు వివరించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. 'ఎంఎస్ ధోనీ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. నేను బరిలోకి దిగినప్పుడు బౌలింగ్, ఫీల్డింగ్ను ఎలా సెట్ చేస్తాడో నాతో చెప్పాడు. అయితే అది నాకు రెండు విధాలుగా అనిపించింది. ఒకటి సానుకూలంగా కాంప్లిమెంట్ ఇచ్చినట్లుగా.. మరొకటి నన్ను తక్కువ అంచనా వేసినట్లుగా అనిపించింది. అయితే నేను మాత్రం దాన్ని సానుకూలంగానే తీసుకున్నా' అని స్టాయినిస్ తెలిపాడు. స్టాయినిస్ టీ20 ప్రపంచకప్ 2021 కోసం యూఏఈలో ఉన్న విషయం తెలిసిందే.
'ఎంఎస్ ధోనీ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెండు రకాలుగా విభజిస్తాడు. దీంతో మైదానంలోకి వచ్చే ఆటగాళ్లను బట్టి అప్పటికప్పుడు పరిస్థితులకు తగిన విధంగా ప్రణాళికలు రచించి అమలు చేస్తాడు. చివరివరకూ క్రీజులో ఉండి మ్యాచ్లు గెలిపించే ఆటగాళ్లను ఒక రకంగా.. రాగానే భారీ షాట్లు ఆడే ఆటగాళ్లను మరో రకంగా చూస్తాడు. నేను చివరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించే ఆటగాడని మహీ అర్థం చేసుకున్నాడు. అందుకు తగినట్టుగానే చెన్నై జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ను సెట్ చేస్తాడు. అలాగే ఇతరుల విషయంలో ఇలా ఉండడు. రాగానే షాట్లు ఆడే వాళ్లను చూస్తే.. మహీ మరోలా ప్రణాళికలు అమలు చేస్తాడు' అని మార్కస్ స్టాయినిస్ చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి మ్యాచులలో విజయాలు అందుకుని రెండో విజయంపై కన్నేశాయి. ఈ మ్యాచులో ఆసీస్ ఫెవరెట్గా కనిపిస్తున్నా.. లంకను తక్కువ అంచనా వేయలేం. ఇక మార్కస్ స్టోయినిస్ ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ 2020 నుంచి పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. స్టోయినిస్ ఓపెనింగ్ చేయగలడు.. మిడిలార్డర్ బ్యాటర్గా ఆడగలడు. అలానే బౌలర్గా సత్తాచాటగలడు. స్టోయినిస్ ఆసీస్ తరఫున 29 టీ20ల్లో 400 పరుగులు, 10 వికెట్లు పడగొట్టాడు.