హైదరాబాద్: రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టు సెమీ ఫైనల్కు చేరి అందరినీ ఆశ్చర్య పరిచింది. 2004 నుంచి రంజీలో పాల్గొంటున్న జార్ఖండ్ జట్టు తొలిసారి ఈ సీజన్లో క్వార్టర్స్ దాటి సెమీ ఫైనల్స్కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. అయితే జార్ఖండ్ ఈ సంచలనాన్ని నమోదు చేయడం వెనుక టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాత్ర ఉందని అంటున్నారు.
న్యూజిలాండ్తో వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ధోని గత కొన్ని నెలలుగా జార్ఖండ్ రంజీ జట్టుకు సమయం వెచ్చించాడని, తమకు మెంటార్ లాగా వ్యవహరించాడని ఆ జట్టు ఆటగాళ్లు అంటున్నారు. తమతో పాటే కలిసి ప్రాక్టీస్ చేసిన ధోని రంజీలో జార్ఖండ్ జట్టు విజయానికి తన సహాయ సహకారాలు అందించినట్లు వెల్లడించారు.
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ భాగంగా డిసెంబర్ 26న హర్యానాతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించి జార్ఖండ్ జట్టు సెమీస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీస్లో భాగంగా జనవరి 2న గుజరాత్తో జార్ఖండ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, నదీం మీడియాతో మాట్లాడారు.

ధోని సూచన మేరకు తన స్టాన్స్, బ్యాటింగ్ శైలి మార్చుకోవడం వల్లే బ్యాటింగ్లో విజయవంతం అయ్యానని ఇషాన్ కిషన్ చెప్పాడు. 'నన్ను ధోని నెట్స్లో చూశాడు. ఆరంభంలో దూకుడుగా ఆడే అలవాటును నియంత్రించుకోవాలని చెప్పాడు. దీంతో నేను ఆ మార్పుపై దృష్టి సారించాను. కొద్దిగా స్టాన్స్ మార్చుకోవడంతో అనూహ్యంగా గతంతో పోలిస్తే క్రీజులో నేను సౌకర్యంగా బ్యాటింగ్ చేయగలిగాను. సెమీస్ వచ్చినా ఇప్పటికీ ఫిట్గా ఉన్నామంటే అందుకు ధోనికి కృతజ్ఞతలు చెప్పాలి' అని ఇషాన్ కిషన్ వెల్లడించాడు.
ఇక బౌలర్ నదీం మాట్లాడుతూ 'ధోని లాంటి వాడు తోడ్పాటు అందిస్తుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. మహారాష్ట్రతో మ్యాచ్కు ముందు ధోని చేసిన సూచన నాకింకా గుర్తుంది. పిచ్ కొంచెం పచ్చికతో కనిపించేసరికి ముందు బ్యాట్స్మెన్ను పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేయడంపై దృష్టిపెట్టమని. తర్వాత బంతుల్లో వైవిధ్యం చూపించమని చెప్పాడు. ఆ సూచన అద్భుతమైన ఫలితాన్నిచ్చింది' అని అన్నాడు.