
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. భారత క్రికెట్ సూపర్ ఫ్యాన్ సుధీర్ గౌతమ్ను తన ఫామ్హౌస్కు ఆహ్వానించి అతడితో కలిసి ధోని విందు చేశాడు. ఇండియా ఆడే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు చూసేవారికి ప్రముఖ క్రికెట్ అభిమాని సుధీర్ గౌతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ దేశంలో భారత జట్టు మ్యాచ్లు ఆడినా సుధీర్ ప్రత్యక్షమై జాతీయ జెండా చేతపట్టుకొని భారత ఆటగాళ్లకు మద్దతు తెలియజేస్తాడు. ముఖ్యంగా అతడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు వీరాభిమాని.
సుధీర్ గౌతంకు ఊహించనీ రీతిలో గొప్ప ఆతిథ్యం లభించింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫౌంహౌజ్లో తన కుటుంబసభ్యులతో విందుకు ఆహ్వానించాడు. ధోనీ భార్య సాక్షి, అతని కుటుంబసభ్యులతో కలిసి సుధీర్ భోజనం చేశాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపాడు.
కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీతో ప్రత్యేకమైన రోజు. ఫామ్ హౌజ్లో సూపర్ ఫ్యామిలీతో సూపర్ లంచ్ చేశా. వాళ్లతో గడిపిన క్షణాలను మాటల్లోనే వివరించలేను. ఎమ్మెస్ ధోనీ, సాక్షికి ధన్యవాదాలు. ఐపీఎల్-2018 టైటిల్ గెలుపొందిన తరువాత కెప్టెన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అని పేర్కొంటూ ధోనీ కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.
సచిన్ టెండూల్కర్ వీరాభిమానిగా గుర్తింపు పొందిన సుధీర్ గౌతమ్.. ధోని అంటే కూడా ప్రత్యేక అభిమానం కనబరుస్తాడు. సచిన్ మ్యాచ్లు వీక్షించడం కోసం ఎన్నోసార్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు సైతం సైకిల్పై ప్రయాణించి అభిమానానికి హద్దులతో పనిలేదని నిరూపించాడు సుధీర్ గౌతమ్. ఒంటి నిండా జెండా రంగులతో, చేతుల్లో జాతీయ జెండాతో టీమిండియాకు సపోర్టుగా నిలిచే సుధీర్ క్రికెట్ వీరాభిమానిగా గుర్తింపు పొందాడు.