తొలుత తన కూతురు జీవాతో కలిసి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్న ధోని... రెండు రోజుల క్రితం తన పెంపుడు శునకాలతో కలిసి గార్డెన్లో సరదాగా క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని అభిమానుల కోసం పోస్టు చేశాడు. ఈ రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇంటి ఆవరణలో పెంపుడు శునకాలతో ధోని క్యాచ్ ప్రాక్టీస్ (వీడియో)
తాజాగా ధోని రాంచీలోని తన నివాసంలో 'లవ్రాత్రి' సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆయుష్ శర్మ, వరీన హుస్సేన్కు విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. సెప్టెంబరు 5న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల కోల్కతాలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. అనంతరం వీరిద్దరూ రాంచీలో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్లో పాల్గొననున్నారు. ఆయుశ్ శర్మ రాంచీ వస్తున్నాడని తెలుసుకున్న ధోని తన నివాసంలో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ హీరోయిన్ వరీన హుస్సేన్ను సైతం ఆహ్వానించాడు.
ఆయుశ్ శర్మ ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ భర్త. నటనపై ఆసక్తి ఉండటంతో లవ్రాత్రి సినిమా ద్వారా బాలీవుడ్లోకి రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ సినిమాకి సల్మాన్ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్నాడు. ధోని-సల్మాన్ఖాన్ చాలా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా దుబాయి వేదికగా ఆసియా కప్ టోర్నమెంట్లో ఆడనుంది. ఈ టోర్నీ కోసం ధోనీ టీమిండియాతో కలవనున్నాడు. సెప్టెంబరు 15న ఆసియా కప్ ప్రారంభంకానుంది.