నేను ఎప్పటికి నీదాన్నే:
తాజాగా ధోనీ అభిమానులు తమ ట్విటర్లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో సాక్షిని ఉద్ధేశించి 'నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలను అభిమానించే ఫాలోవర్స్ జాబితాలో నన్ను కూడా చేర్చావుగా' అంటూ ధోనీ ట్రోల్ చేశారు. దీంతో రూంలో ఉన్న మిగతావారు ఒక్కసారిగా నవ్వులు పూయించారు. అందరూ నవ్వడంతో సాక్షి.. మహీ దగ్గరకు వచ్చి 'బేబీ నాకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా.. నేను ఎప్పటికి నీదాన్నే' అని అన్నారు.
క్రికెట్కు విరామం:
వన్డే ప్రపంచకప్ 2019 అనంతరం ఎంఎస్ ధోనీ క్రికెట్కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. రెండు నెలల విశ్రాంతి కాస్త ఆరు నెలలు దాటింది. దీంతో మహీ రిటైర్మెంట్పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా ధోనీ మాత్రం తన రిటైర్మెంట్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
కాంట్రాక్ట్ లిస్టులో దక్కని చోటు:
తాజాగా బీసీసీఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించగా.. అందులోనూ ధోనీకి కాంట్రాక్ట్ని ఇవ్వలేదు. దీంతో మహీ మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడటం అనుమానమేనంటూ వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ తనను కాంట్రాక్ట్ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020కి సన్నద్ధం అవుతున్న విషయాన్ని మహీ చెప్పకనే చెప్పేశాడు.
2021 ఐపీఎల్ మహీ ఆడుతాడు:
మహీ టీమిండియాకు ఆడినా ఆడకపోయినా.. ఈ ఏడాడితో పాటు వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 'ధోనీ 2020 ఐపీఎల్ ఆడుతాడు. 2020 ఐపీఎల్తో పాటు 20021 ఐపీఎల్లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా.. మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్ తెలిపాడు.