టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ప్రారంభం (2008) నుండి ఇప్పటి వరకూ ఏమీ మారలేదని, తనలోని ప్రశాంతత అలాగే ఉందని ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లలో చెన్నై జట్టు విజయాలు సాధించి దూసుకుపోతోంది. వాంఖడే మైదానంలో ఈ రోజు రాత్రి ముంబయి ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొననుంది. ఈ నేపథ్యంలో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడారు.
2008 నుంచి ధోనీని చూస్తున్నా:
'ఐపీఎల్ ప్రారంభం నుండి ధోనీ తన మార్క్ ఆటతో అలరిస్తున్నాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్పై ధోనీ ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమం. 2008 నుంచి ధోనీని చూస్తున్నా.. తన ఆటలో ఎలాంటి మార్పు లేదు. అతను ఏమీ మారలేదు. ఎప్పుడూ కూడా టీమ్ గెలిచేలా కృషి చేస్తాడు. మ్యాచ్ ఉత్కంఠగా ఉన్నా.. కచ్చితంగా గెలిచే స్థితిలో ఉన్నా ధోనీ కూల్, కామ్గానే ఉంటాడు. ఇదే జట్టుని నిలకడగా రాణించేలా చేస్తోంది' అని ఫ్లెమింగ్ చెప్పారు.
రాయుడికి తగినన్ని అవకాశాలిస్తాం:
'టీమిండియా ఆటగాడు అంబటి రాయుడిని వరల్డ్కప్ ఆలోచనల నుంచి బయటకు తీసుకురావాలి. రాయుడుకి తగినంతస్వేచ్ఛ ఇవ్వాలి. వైఫల్యాలతో రాయుడు నిరాశపడకుండా.. అతనికి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తామని' ఫ్లెమింగ్ తెలిపారు. ఫ్లెమింగ్ ఆలోచన ఒకవిధంగా ఉంటే.. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆలోచన మరోలా ఉంది. ఐపీఎల్పైనే దృష్టిపెట్టమని, ఇదే తన ప్రధమిక బాధ్యతని పంత్కు పాంటింగ్ సూచించాడు.