
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై అతడి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే తోసిపుచ్చాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనే లేదని అతడు స్పష్టం చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్లో ధోని పేలవ ప్రదర్శనతో నిరాశపరచడంతో అతడి రిటైర్మెంట్పై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో అరుణ్ పాండే మాట్లాడుతూ "ఇప్పటికిప్పుడు క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచన ధోనీకి లేదు. అయినా భారత క్రికెట్కు ఎనలేని సేవలందిస్తున్న గొప్ప ఆటగాడి భవిష్యత్పై ఇలాంటి కథనాలు వస్తుండడం బాధాకరం" అంటూ పేర్కొన్నాడు. ఆదివారం వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు.
దీంతో ధోనిని ఎంపిక చేస్తారా? లేదా విశ్రాంతినిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరికొంత కాలం ధోనీ కొనసాగాలనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రపంచకప్లో బెస్ట్ ఫినిషర్గా విఫలమైన ధోనిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.