
హైదరాబాద్: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు కెప్టెన్సీ వహించిన మహేంద్ర సింగ్ ధోనీ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్నాడు. ఆ సమయంలో భారత జట్టుకు కోచ్గా విధులు నిర్వర్తించిన దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్స్టన్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఆ చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇండియా.. ఇండియా అంటూ హర్షధ్వానాలు చేశాడు.
భారతీయ ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చిన విదేశీ కోచ్లలో గ్యారీ కిర్స్టన్ ప్రథముడు. ఈ సందర్భంగా ప్రముఖ ఇంగ్లీషు మీడియాతో కిర్స్టన్ ముచ్చటించాడు.
ప్రశ్న: 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు మీరు టీమిండియాకే శిక్షణ ఇచ్చారు కదా. అది గెలిచిన తర్వాత మీకెలా అనిపించింది.?
జవాబు: ఆ పరిస్థితుల్లో జట్టులో ఒక కుటుంబ వాతావరణం నెలకొంది. జ్ఞాపకాలైతే ఒకట్రెండు కాదు. చాలానే ఉన్నాయి.
ప్రశ్న: ధోనీ ఫామ్ను పునరావృతం చేస్తున్నాడా.? అతనిలో మార్పు ఏమైనా గమనించారా?
జవాబు: అతనిలో మార్పు ఏమీ లేదు. ఫామ్ పునరావృతం కాదు. అతనేంటో గతాన్ని గుర్తు చేస్తున్నాడంతే.
ప్రశ్న: 2011 తర్వాత మళ్లీ ధోనీ 2019 ప్రపంచ కప్ను కూడా గెలిచేందుకు అవకాశాలున్నాయంటారా?
జవాబు: కేవలం ఇండియా ఒక్కటే కాదు. ఈ సారి ప్రపంచ కప్ గెలుచుకునేందుకు చాలా దేశాల జట్లకు అవకాశాలున్నాయి. ఈ సారి టోర్నమెంట్ అత్యంత ఆసక్తిగా మారనుంది.
ప్రశ్న: స్మిత్, వార్నర్ లేని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా సునాయాసంగా గెలుస్తుందనుకుంటున్నారా?
జవాబు: ఇది చాలా క్లిష్టమైన మ్యాచ్. దాని కోసం నేనూ ఆతురతగా ఎదురుచూస్తున్నా..
ప్రశ్న: కౌంటీ క్రికెట్ విరాట్ కోహ్లికి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చనుంది.?
జవాబు: చివరి సమయం వరకూ ఆటగాళ్ల ఏం చేయగలరనేది అంచనా వేయలేం. నిజానికి అతను అద్భుతమైన ప్రదర్శన చేయగల ఆటగాడు.
ప్రశ్న: ఐపీఎల్ 11లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచింగ్ అనుభవం ఎలా ఉంది?
జవాబు: చక్కటి వాతావరణం మధ్య ప్రతి నిమిషం ఎంజాయ్ చేశాం.
ప్రశ్న: ఇప్పటి వరకూ ఢిల్లీ డేర్డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు శిక్షణ ఇచ్చారు. భారత ఆటగాళ్ల ప్రతిభ గురించి ఏం గమనించారు?
జవాబు: ఇండియాలో అత్యద్భుతమైన ఆటగాళ్లున్నారు. వాళ్లను చూసి చాలా సార్లు ఉత్తేజానికి గురైయ్యాను. అసలు ఐపీఎల్ అంటే అలానే కదా ఉండాలి. చాలా మంది వరకూ ఆటగాళ్లు ఐపీఎల్ను ఎదిగేందుకు మంచి ప్లాట్ ఫామ్గా భావిస్తున్నారు. ఇదొక మంచి పరిణామం.