హైదరాబాద్: క్రికెటర్లు... కార్పోరేట్ కంపెనీల వద్ద కోట్లు తీసుకుని వాటికి బ్రాండ్ అంబాసిడర్లగా ఉండటాన్ని మనం చూశాం. క్రికెటర్లను చూసి వారి ప్రచారం చేసిన ఉత్పత్తులను అభిమానులు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని కార్పోరేట్ సంస్ధలు కస్టమర్లకు ఇచ్చిన ప్రామిస్ను నిలబెట్టుకోవడంలో విఫలమవుతుంటాయి.
ఇది ప్రచారం నిర్వహించిన క్రికెటర్ల ఇమేజిని దెబ్బతీస్తుంది. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అంబాసిడర్లుగా ఉన్నందుకు ధోనీ, హర్భజన్ సింగ్లపై కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ సంస్థ తమను మోసం చేయడంతో వాళ్లు తమ కోపాన్ని క్రికెటర్లపై చూపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
నోయిడాకు చెందిన ప్రముఖ భవన నిర్మాణ సంస్థ ఆమ్రపాలి గ్రూప్కి గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. గత ఏడాది ఈ సంస్థపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డబ్బులు తీసుకుని ఫ్లాట్ల కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
దీంతో పలువురు పెట్టుబడుదారులు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా సంస్థ యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ధోనీ ఆ గ్రూపుతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. తాజాగా ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా ధోనీ, భజ్జీని ఉద్దేశించి...

'మీకు మాత్రం విల్లాలు వచ్చాయి.. మేం పెట్టిన డబ్బులు కూడా పోయాయి' అంటూ రమేశ్ నైన్వాల్ అనే నెటిజన్ ధోనీ, హర్భజన్లను నిందిస్తూ ట్విట్టర్లో పోస్టు చేశాడు.
దీనికి హర్భజన్ సింగ్ కాస్తంత ఘాటుగానే సమాధానమిచ్చాడు. మాకు విల్లాలు వచ్చాయని ఎవరు చెప్పారు? మాకు ఏమీ రాలేదు. మిమ్మల్ని పిచ్చోళ్లను చేశారు. మా పేర్లు వాడుకొని వాళ్లు జనాలను మోసం చేశారు అని భజ్జీ ట్వీట్ చేశాడు.
అయితే ఆ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానికి ధోనీకి మంచి ఫ్రెండ్ అని, హర్భజన్ అబద్ధమాడకు అని మరో నెటిజన్ స్పందించాడు.
దీనిపై కూడా హర్భజన్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. 'ధోనీకి ఫ్రెండ్ కదా.. నాకు కాదు కదా.. అతన్నే వెళ్లి అడుగు నీకు కొంచమైనా మెదడు ఉంటే' అని ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే ఇదే రియల్ ఎస్టేట్ సంస్థ 2011 వరల్డ్కప్ గెలిచిన భారత జట్టు సభ్యులకు విల్లాలు ఇస్తామని అప్పట్లో ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తమకు మాత్రం ఏ విల్లాలూ ఇవ్వలేదని హర్భజన్ సింగ్తో పాటు కొందరు క్రికెటర్లు చెప్పారు.