హైదరాబాద్: శ్రీలంకతో ముగిసిన సిరిస్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో తన కెరీర్లో 300 వన్డేల మైలురాయిని దాటడంతో పాటు, 100 స్టంపింగ్లు చేసిన రికార్డుతో పాటు, వన్డేల్లో అత్యధిక సార్లు నాటౌట్గా నిలిచిన రికార్డుని ధోని సాధించిన సంగతి తెలిసిందే.
తాజాగా బుధవారం శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20లో ధోని మరో ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. విదేశాల్లో అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్గా ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ను స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు.

ఇన్నింగ్స్ 6.3వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో మాథ్యూస్ (7) హిట్టింగ్కి ప్రయత్నించిన సమయంలో వికెట్ని సమర్పించుకున్నాడు. చాహల్ విసిరిన బంతిని క్రీజు వెలుపలకి వచ్చి షాట్ కోసం మాథ్యూస్ ప్రయత్నించాడు. అయితే.. బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని ధోనీ చేతుల్లోకి వెళ్లింది.
వెంటనే అతను వికెట్లను గీరాటేయంతో మాథ్యూస్ నిరాశగా వెనుదిరిగాడు. టీవీ అంపైర్ తన నిర్ణయం ప్రకటించేందుకు కనీసం రెండు నిమిషాలు తీసుకున్నాడు. రిప్లేలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చినట్లు కనిపించినా.. బెయిల్స్ని పడగొట్టిన సమయంలో అతని షూ గాల్లోనే ఉండటంతో థర్డ్ అంపైర్ అవుట్గా ప్రకటించాడు.
దీంతో విదేశాల్లో 476 అవుట్లను ధోని సాధించాడు. తద్వారా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్(475) పేరిట ఉన్న రికార్డును ధోని బద్దలు కొట్టారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్(460) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే టీ20ల్లో అత్యధిక అవుట్లు చేసిన రికార్డు కూడా ధోని పేరిటే ఉంది. టీ20ల్లో ధోని 67 అవుట్లు చేసి అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్(60) నిలిచాడు. శ్రీలంకతో ముగిసిన సిరిస్ అటు కెప్టెన్ కోహ్లీతో పాటు ధోనికి కూడా మరుపురాని జ్ఞాపకాలను మిగిల్చింది.