హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిల మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆఖరి వన్డే మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

అయితే దీనిని చాలా మంది గమనించకపోవడం విశేషం. ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు వన్డేల సిరిస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగో వికెట్కి కెప్టెన్ కోహ్లీ, కేదార్ జాదవ్లు కలసి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఈ క్రమంలో విజయానికి మరో రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో జాదవ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి ధోని వచ్చాడు. ధోని బ్యాటింగ్కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. మ్యాచ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న ధోనీ, ఈసారి ఆ అవకాశాన్ని క్రీజులో పాతుకుపోయి ఉన్న కోహ్లీని ఇచ్చాడు.
వచ్చీ రాగానే తాను ఎదుర్కొన్న బంతికి సింగిల్ తీసి, స్ట్రయికింగ్ను కోహ్లీకి ఇచ్చాడు. తనకు బదులుగా కోహ్లీకి విన్నింగ్ షాట్ కొట్టే అవకాశాన్ని ధోనీ ఇవ్వడం, క్రీజు మధ్యలో వారిద్దరూ నవ్వుకోవడం, ఆపై వెంటనే కోహ్లీ విజయాన్ని పరిపూర్ణం చేయడం జరిగిపోయాయి. విన్నింగ్ షాట్ అనంతరం పెవీలియన్కు వస్తూ కోహ్లీ... ధోనీకి థ్యాంక్స్ కూడా చెప్పాడంట.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. ధోని క్రీడాస్పూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ తన కెరీర్లో 30వ సెంచరీని నమోదు చేసి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సరసన చేరిన సంగతి తెలిసిందే. కోహ్లీకి ముందు సచిన్ ఒక్కడే 49 వన్డే సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.