
ధోనీని చూస్తే మా నాన్న రమేశ్ టెండూల్కర్ గుర్తుకు వస్తారు
'ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ధోనీని చూస్తే మా నాన్న రమేశ్ టెండూల్కర్ గుర్తుకు వస్తారు. మొదటిసారి ధోనిని కలిసినప్పుడు నాకెంతో గౌరవమిచ్చాడు. అప్పుడే నాకు మా నాన్న గుర్తొచ్చారు. జట్టు గెలిచినా.. ఓడినా ధోని చాలా సైలెంట్గా కనిపించేవాడు. మా నాన్న కూడా అంతే. ఏది జరిగినా మౌనంగా ఉంటారు. అందుకే ధోనీని చూస్తే నాకు మా నాన్న గుర్తుకు వచ్చేవారు' అని సచిన్ అన్నాడు. ఇదిలా ఉంటే సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ 1999 మే 19న మరణించారు. తండ్రి మరణించిన సమయంలో సచిన్ టెండూల్కర్ 1999 వరల్డ్ కప్ ఆడేందుకు ఇంగ్లాండ్కు వెళ్లాడు.

'హీరో: ఏ బయోగ్రఫీ ఆఫ్ సచిన్ రమేష్ టెండూల్కర్' పుస్తకంలో
ఈ విషయాన్ని దేవేంద్ర ప్రభుదేశాయ్ రాసిన 'హీరో: ఏ బయోగ్రఫీ ఆఫ్ సచిన్ రమేష్ టెండూల్కర్' పుస్తకంలో ప్రస్తావించారు. 1999లో వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లాండ్ వెళ్లింది. ఈ టోర్నీలో భాగంగా మొదట దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాతి మ్యాచ్ జింబాబ్వేపై ఆడాల్సి ఉంది. ఈ సందర్భంలో సచిన్ టెండూల్కర్ తన స్నేహితుడు అతుల్ రనడేతో కలిసి హోటల్ రూంలో ఉన్నాడు. ఈ సమయంలో సచిన్ ఊహించని, విషాదకర వార్త విన్నాడు.

సచిన్ వెళ్లి డోర్ తీయగా భార్య అంజలి కనిపించింది
హోటల్ గదిలో సచిన్ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. సచిన్ వెళ్లి డోర్ తీయగా భార్య అంజలి కనిపించింది. ఆమె పక్కన క్రికెటర్లు అజయ్ జడేజా, రాబిన్ సింగ్ ఉన్నారు. సచిన్కు విషాదకర వార్త చెప్పేందుకు ఆమె లండన్ నుంచి అత్యవసరంగా లీసెస్టర్ వచ్చింది. సచిన్ తండ్రి, ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త విని షాక్కు గురైన సచిన్ వెంటన్ వెంటనే భార్య అంజలితో కలసి ముంబై వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అదే సమయంలో టోర్నీలో టీమిండియా రెండో లీగ్ మ్యాచ్లో భాగంగా జింబాబ్వేతో తలపడింది. సచిన్ లేని ఈ మ్యాచ్లో టీమిండియా మూడు పరుగులతో ఓడింది.

మూడు లీగ్ మ్యాచ్లలో గెలిచి తీరాలి
దీంతో ఆడిన రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఓటమి పాలైంది. టీమిండియా సూపర్ సిక్స్లోకి ప్రవేశించాలంటే మిగిలిన మూడు లీగ్ మ్యాచ్లలో గెలిచి తీరాలి. ఇలాంటి సమయంలో జట్టుకు సచిన్ ఎంతో అవసరం. అయితే తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న సచిన్ను వెనక్కురమ్మని పిలవడానికి టీమిండియా మేనేజ్మెంట్కు మనస్కరించలేదు. అంతేకాదు వరల్డ్ కప్లో ఆడాలా వద్దా అన్న విషయాన్ని కూడా సచిన్ నిర్ణయానికి వదిలేసింది. ఇలాంటి సమయంలో సచిన్ తల్లి అతడిని ఒప్పించి ఇంగ్లండ్ వెళ్లి ప్రపంచ కప్లో ఆడాల్సిందిగా చెప్పారు.

తల్లి మాటపై గౌరవంతో ఇంగ్లాండ్కు పయనమైన సచిన్
తల్లి మాటపై గౌరవంతో సచిన్ బాధను గుండెల్లో దాచుకుని ఇంగ్లాండ్కు పయనమయ్యాడు. సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్లో ఆడేందుకు వస్తున్నాడని తెలియగానే అటు అభిమానులతో పాటు క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టోర్నీలో భాగంగా బ్రిస్టెల్లో కెన్యాతో జరిగిన మూడో మ్యాచ్లో 101 బంతుల్లో సచిన్ టెండూల్కర్ సెంచరీ (140) సాధించాడు. ఈ సెంచరీని సచిన్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ దృశ్యం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది.


Click it and Unblock the Notifications