
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో పేలవ ఆట తీరుతో ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. ఈసారి మాత్రం దుమురేపుతోంది. అన్ని జట్ల కంటే ముందు ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం రాత్రి షార్జా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో సీఎస్కే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై ఈ సీజన్లో తొమ్మిదో విజయం సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 11 మ్యాచులు ఆడిన చెన్నై 9 విజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో ఇంకా మూడు మ్యాచులు ఆడనున్న చెన్నై.. మరిన్ని విజయాలపై కన్నేసింది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో ధోనీసేన తలపడనుంది.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచుకు ముందు చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సీఎస్కే బౌలర్లకు పలు సూచనలు చేశాడట. షార్జాలో పిచ్ బౌన్స్ అవుతుందని, ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని చెన్నై బౌలర్లకు మహీ చెప్పాడట. టాస్ కోసం మైదానంలోని వెళ్లిన ధోనీ.. పిచ్ చూసిన తర్వాత చెన్నై బౌలర్లతో మాట్లాడాడు. 'పిచ్పై బౌన్స్ భిన్నంగా ఉంది. మాములుగా కంటే ఎక్కువ బౌన్స్ అవుతుంది. ఒకవేళ స్ట్రయిట్ షాట్లు కొడితే సక్సెస్ అవుతామని బ్యాటర్ అర్ధం చేసుకుంటే పరుగులు వస్తాయి. ఆ అవకాశం ఇవ్వకూడదు. ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది' అని ధోనీ బౌలర్లకు చెప్పడట.
మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'ఇన్నింగ్స్ ఆరంభంలో బంతి ప్రారంభంలో బాగా టర్న్ కాగా.. ఆ తర్వాత బ్యాట్పైకి రావడం ప్రారంభించింది. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. పిచ్పై బ్యాట్స్మెన్కు అవగాహక కలిగాక విజయవంతమయ్యారు' అని తెలిపాడు. 'అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్కు చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇదెంతో ప్రత్యేకం. ఎప్పుడూ మేం ప్లే ఆఫ్స్ చేరే జట్టని అందరికీ తెలిసిందే. అయితే ప్రతిసారి మ్యాచ్లు గెలవడం జరగదు. గతేడాది మాకు ఎన్నో విషయాలు కలిసిరాలేదు. అప్పుడు విఫలమవ్వడం గురించి కారణాలు చెప్పడం సరికాదు. అప్పుడు కానిది ఇప్పుడు చేశాం' అని ధోనీ పేరొన్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ఎంఎస్ ధోనీ సిక్సర్తో చెన్నైకి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ కౌల్ వేసిన 19.4 బంతిని ధోనీ స్టాండ్స్లోకి తరలించి తన జట్టును ఘనంగా ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లాడు. ధోనీ సిక్సుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా రోజుల తర్వాత మహీ తనదైన శైలిలో మ్యాచును ముగించడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2020 నుంచి ధోనీ సరైన ప్రదర్శన చేయని విషయం తెలిసిందే. బ్యాటుతో రాణించకపోయినా.. తన వికెట్ కీపింగ్, కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు.