ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు చెందిన ఇద్దరు అధికారులపై దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రిమినల్ కేసు పెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలను నిర్వహించేందుకు ధోనీతో ఆర్కా స్పోర్ట్స్ సంస్థ 2017లో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఒప్పందంలోని షరతులను పాటించట్లేదని ఆర్కా స్పోర్ట్స్కు చెందిన ఇద్దరు అధికారులు మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాష్లపై ధోనీ రాంచీలో క్రిమినల్ కేసులు పెట్టాడు.
నిబంధనల ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము చెల్లించి, లాభాలు పంచుకోవాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఈ విషయాన్ని నోటీసుల ద్వారా ఆర్కా స్పోర్ట్స్కు పలుసార్లు తెలియజేసినా ఫలితం లేకపోయింది. దీంతో 2021 ఆగస్టులో ఆర్కా సంస్థకు మంజూరు చేసిన అధికారిక లేఖను ధోనీ ఉపసంహరించుకున్నాడు. ఆర్కా స్పోర్ట్స్ వల్ల సుమారు రూ.15 కోట్లు నష్టం కలిగిందని ధోనీ తరపున విధి అసోసియేట్స్ బాధ్యతలు చూసుకునే దయానంద్ సింగ్ పేర్కొన్నాడు.

నూతన సంవత్సర వేడుకలను దుబాయ్లో జరుపుకున్న ధోనీ ఇటీవల భారత్కు తిరిగొచ్చాడు. ధోనీతో పాటు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా న్యూ ఇయర్ పార్టీలో కనిపించాడు. డిసెంబర్ 19న ముగిసిన ఐపీఎల్ వేలంలోనూ మహీ, పంత్ ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరూ టెన్నిస్ ఆడిన వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
అయితే గత కొన్ని ఐపీఎల్ సీజన్ల ప్రారంభానికి ముందు ధోనీ గురించే ఓ వార్త ఎప్పుడూ చక్కర్లు కొడుతుంటుంది. ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ కథనాలు వస్తాయి. దీనిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఇటీవల స్పందిస్తూ.. ''ఆ విషయం మాకు తెలియదు. దాని గురించి ధోనీ మాకు కూడా ఏదీ చెప్పడు. అతడే దీనికి సమాధానం ఇవ్వగలడు'' అని అన్నాడు. కాగా, 42 ఏళ్ల ధోనీ ఈ ఏడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. మరో కొన్ని రోజుల్లో ధోనీ నెట్స్లో సాధన మొదలుపెట్టనున్నాడు.