ఇంతకీ ఏమిటా కామెంట్స్..
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా సౌతాంప్టన్లోని రోజ్బౌల్ స్టేడియంలో శనివారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ సచిన్ టెండుల్కర్ విమర్శలు చేయడానికి ఆస్కారం ఇచ్చింది. ఈ మ్యాచ్లో ధోనీ.. తన శైలికి భిన్నంగా చాలా మందకొడిగా ఆడాడు. 52 బంతుల్లో 28 పరుగులు చేశాడు. భారీ షాట్ను ఆడటానికి ప్రయత్నించి, స్టంప్ అవుట్ అయ్యాడు. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్తో కలిసి ధోనీ.. విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ.. అతని ఇన్నింగ్ చాలా మందకొడిగా సాగిందని సచిన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ధోనీలో ఆత్మవిశ్వాసం కనిపించలేదని, అతని బ్యాటింగ్ సానుకూల దృక్పథంతో సాగలేదని అన్నారు.
నిరాశకు గురి చేసిన ధోనీ బ్యాటింగ్
ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ బ్యాటింగ్ తీరును తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని సచిన్ చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్లో ధోనీ చేసిన బ్యాటింగ్లో గత వైభవం కనిపించలేదని చెప్పారు. అంతకంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మహేంద్ర సింగ్ ధోనీ-కేదార్ జాదవ్ మధ్య నెలకొన్న భాగస్వామ్యం పట్ల కూడా తాను నిరాశగా ఉన్నానని అన్నారు. వారిద్దరి మధ్య నెలకొన్న భాగస్వామ్యం తనకు సంతృప్తికరంగా లేదని చెప్పారు. 34 ఓవర్ల పాటు స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొన్న టీమిండియా బ్యాట్స్మెన్లు కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగారని అన్నారు. స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ.. భారీ స్కోరును సాధించలేకపోయారని చెప్పారు.
సచిన్ కామెంట్లపై ధోనీ అభిమానులు గుర్రు..
సచిన్ టెండుల్కర్ చేసిన ఈ వ్యాఖ్యానాలపై ధోనీ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను ట్రోల్ చేస్తున్నారు. సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోనీలపై బాలీవుడ్లో రూపుదిద్దుకున్న బయోపిక్ మూవీలను కూడా ఈ రచ్చలోకి తీసుకొచ్చారు. తమదైన శైలిలో సచిన్పై విమర్శలు చేశారు నెటిజన్లు.