
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తాను గ్రౌండ్లో ఎందుకు కోప్పడడో తెలిపాడు. తనకు కూడా కోపం వస్తుందని కానీ చివరి క్షణంలో తన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. లైవ్ ఫాస్ట్ అనే ఓ కంపెనీ ఈవెంట్లో ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబులిస్తూ ధోనీ ఇలా బదులిచ్చాడు. 'నిజాయితీగా చెప్పాలంటే.. మేము గ్రౌండ్లో ఉన్నప్పుడు.. మిస్ ఫీల్డింగ్, క్యాచ్లు వదిలివేయడం లేదా మరేదైనా తప్పులు చేయకూడదనుకుంటాం. ఒక ఆటగాడు ఎందుకు క్యాచ్ని ఎందుకు డ్రాప్ చేశాడో.. ఎందుకు తప్పుగా ఫీల్డింగ్ చేశాడో గుర్తించడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. వారి స్థానాల్లో ఉండి ఆలోచిస్తాను. కోపం తెచ్చుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.. మనల్ని 40,000మంది స్టాండ్లలో నుంచి చూస్తుంటారు. కోట్లాది మంది ప్రజలు మ్యాచ్ను టీవీల్లో చూస్తుంటారు. నేను నా జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాననే విషయాన్ని నిరంతరం గుర్తుతెచ్చుకుంటూ భావోద్వేగాలను నియంత్రించుకుంటా. నేను ఫీల్డర్ తప్పుకు కారణమేమిటో తప్పకుండా తర్వాత తెలుసుకుంటాను.' అని పేర్కొన్నాడు. ఒక ఆటగాడు గ్రౌండ్లో 100శాతం అటెంటివ్గా ఉండి.. క్యాచ్ని మిస్ చేసుంటే అది పెద్ద విషయం కాదు. కొన్ని సార్లు క్యాచ్లు మిస్సవుతాయి. అంతకు ముందు ప్రాక్టీస్ సమయంలో అతను ఎలాంటి క్యాచ్ లు పట్టాడో నేను చూసే ఉంటాను. ఎలాంటి క్యాచ్లు పట్టే విషయంలో ఇబ్బంది పడుతున్నాడనే విషయాన్ని కూడా గమనించి.. దానిపై దృష్టి పెట్టేలా చూసుకుంటే చాలు అని చెబుతా. బహుశా ఒక్కోసారి క్యాచ్ల కారణంగా మ్యాచ్లు కోల్పోతాం కానీ ఏదేమైనా ఉద్దేశపూర్వకంగా ఎవరూ మిస్ చేయరు కదా.. అందుకే వాళ్ల స్థానాల్లో నుంచి నేను ఆలోచిస్తా' అని ధోనీ చెప్పాడు.
'కొందరు నాకు కోపం రాదంటూ మాట్లాడుతారు. బట్ నేను కూడా మనిషినే. మీరందరూ ఎలా అనుకుంటారో నాకు కూడా లోపల అలాగే అనిపిస్తుంది. మీరు బయట ఎప్పుడైన మ్యాచ్ ఆడినప్పుడు ప్లేయర్లు తప్పులు చేస్తే బ్యాడ్గా ఫీలవుతారా కాదా.. మేము మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం.. అలాంటి మ్యాచ్లో తప్పులు జరిగితే బ్యాడ్ కాదు వరస్ట్గా ఫీలవుతాం. కానీ మేము ఎప్పుడూ బాగా ఆడడానికి ప్రయత్నిస్తాము. గ్రౌండ్లో మా భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తాం. బయట కూర్చొని.. లోపల గ్రౌండ్లో ఆడేవాళ్లు ఇలా ఆడితే బాగుండు.. అలా ఆడితే బాగుండు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ గ్రౌండ్లో బయట చెప్పినంత సులభంగా ఉండదు మ్యాచ్. మేం ఎలాగైతే జాతీయ జట్టు తరఫున ఆడుతున్నామో మన ఆపోనెంట్ కూడా వాళ్ల జాతీయ జట్టుకు ఆడుతుంది. అంటే తప్పకుండా ఎంతో కొంత ప్రెషర్ మనపైన ఉంటుంది.' అని ధోనీ చెప్పాడు. క్రీడా కార్యక్రమాలకు ప్రజలు నిరంతరం మద్దతునిస్తూ ఉండాలి అని పేర్కొన్నాడు.