
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉందని, దాని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. సీఎస్కే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కష్టాల్లోనూ నెట్టుకొచ్చిన కెప్టెన్ మనకు ఉన్నాడని ఆయన ధైర్యం చెప్పారు. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు 11 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో.. అన్ని జట్ల కంటే చివరిగా సీఎస్కే ప్రాక్టీస్ మొదలెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా సీఎస్కే ట్విటర్లో పంచుకున్న ఓ వీడియోలో విశ్వనాథన్ మాట్లాడుతూ.... 'చెన్నై అభిమానులందరికీ ఓ విషయం చెబుతున్నా. ఇప్పుడు జట్టు మంచి స్థితిలో ఉంది. మీరెలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. కష్టాల్లోనూ నెట్టుకొచ్చిన సారథి మనకు ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎంఎస్ ధోనీ జట్టును ముందుండి నడిపిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆటగాళ్లంతా బాగున్నారు. కోచ్లు, కెప్టెన్ ఎప్పటికప్పుడు ఆటగాళ్లతో మాట్లాడుతున్నారు. వారిలో నమ్మకం కలిగిస్తున్నారు. రాబోయే రోజుల్లో సీఎస్కే బరిలో దిగడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని చెప్పారు.
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం ఉందని, అభిమానులు కూడా అంతే విశ్వాసంతో ఉన్నారని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. తమ జట్టుకు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. అదెప్పటికీ అలాగే ఉండాలని, టోర్నీ జరిగేటప్పుడు వారి మద్దతు అవసరమని పేరొన్నారు. ఆదివారం ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. అనుకున్నట్లే సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. దీంతో మెగా టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరోనా కారణంగా ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఆలస్యం కావడంతో సీఎస్కే నైట్ ప్రాక్టీస్ సెషన్ను కూడా ఆరంబించింది. నెట్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ మొదటగా డిఫెన్స్ ఆడి.. ఆ తర్వాత గేర్ మార్చాడు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్లలో భారీ షాట్లు ఆడాడు. మొదటగా ఫిట్నెస్కు సంబందించిన సాధన చేసిన మహీ.. ఆపై నెట్ సెషన్లో చమటోడ్చాడు. ఎంఎస్ ధోనీ, ఓపెనర్ షేన్ వాట్సన్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.
ఐపీఎల్ 2020 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆఫ్స్పిన్నర్ హర్భజన్ సింగ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ టోర్నీకి దూరమవున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ఇక స్టార్ ఆటగాడు సురేశ్ రైనా కూడా ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేడు. ఐపీఎల్కు యూఏఈ వెళ్లినా.. కొన్ని కుటుంబ కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. అయితే సీఎస్కేతో రైనా జట్టుతో కలుస్తాడా.. లేదా అనేది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. అయితే రైనా ఇంటి వద్దే కసరత్తులు చేస్తున్నాడు. డంబుల్స్ ఎత్తడం, పరుగులు తీయడం చేస్తున్నాడు. ఆ వీడియోను అతడు ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా.. తిరిగి మళ్లీ యూఏఈకి వెళతాడేమోనని అనిపిస్తోంది.